
తాజా వార్తలు
పండగవేళ విషాదం: దంపతులు మృతి
పుల్కల్: భర్తతో గొడవపడి నిప్పుంటించుకున్న భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు ఆమె భర్త. ఈ ప్రయత్నంలో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతై మృతి చెందారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. దీంతో పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లేశ్(42), సునీత(32)లు దంపతులు. గత కొంతకాలంగా ఎల్లేశ్ మద్యానికి బానిసవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తలు ఇద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో సహనాన్ని కోల్పోయిన సునీత తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గమనించిన భర్త ఎల్లేశ్ తన భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎల్లేశ్కు కూడా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మంటల్లో కాలిపోవడం చూసిన వారి కుమార్తె హారిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే 108కి సమాచారం అందించారు. బాధితులిద్దరినీ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో సునీత ప్రాణాలు కోల్పోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఎల్లేశ్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎల్లేశ్ మృతి చెందాడు. మృతురాలి అన్న సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు.
ఇవీ చదవండి..
ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
దేశవ్యాప్తంగా 31న పల్స్ పోలియో