
తాజా వార్తలు
బోయిన్పల్లి కేసులో మరో 15మంది అరెస్టు
హైదరాబాద్: ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, గుంటూరు శీను, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ పరారీలో ఉన్నారని.. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని సీపీ చెప్పారు.
కిడ్నాప్ కేసులో ఈ నెల 6న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలతో అఖిలప్రియను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. కస్టడీ ముగియగానే ఈ నెల 14న కోర్టులో హాజరుపరిచారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అఖిలప్రియను చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో సేకరించిన కీలక సమాచారంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.. అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్ఫోన్ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అఖిలప్రియ ఉపయోగించిన రెండు చరవాణిలు ఆమె ఇంట్లోనే ఉండిపోవడంతో, వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అసలేం జరిగింది..
హఫీజ్ పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమిని ఆయన బినామీ ఏవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించేవారు. 2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. న్యాయవాది కృష్ణారావు మరణంతో... ఆయన కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ సుబ్బారెడ్డి... ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకొని బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయం అఖిల ప్రియకు తెలియడంతో కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని, వాటా ఇవ్వాల్సిందిగా కోరింది. నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.
ఇవీ చదవండి..
గబ్బా కాదు..శార్దూల్-సుందర్ల దాబా: సెహ్వాగ్
మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు