
తాజా వార్తలు
బ్రెజిల్ రకం వైరస్ 2.2 రెట్లు ప్రమాదకరం
వెల్లడిస్తున్న అధ్యయనాలు
లండన్: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించాయి. వ్యాక్సినేషన్ సజావుగా సాగుతున్న తరుణంలో వైరస్ జన్యుమార్పిడి చెందుతూ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కొత్తరకం కరోనాను గుర్తించారు. వీటిలో బ్రెజిల్లో వెలుగుచూసిన కరోనా వేరియంట్ (పీ1) 2.2 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే స్వభావంతో ఉందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బ్రెజిల్, యూకేకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బ్రెజిల్ కరోనా రకం 61 శాతం రోగనిరోధకతను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు.
బ్రెజిల్లో కరోనా రెండో దఫా వ్యాప్తికి ఈ రకం వైరస్సే కారణమని ఆ అధ్యయనంలో వెల్లడైంది. రెండో దఫాలో కరోనా సోకిన వారు ఎక్కువ రోగనిరోధకశక్తిని కోల్పోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. గతేడాది నవంబరు నుంచి 2021 జనవరి వరకు ఈ పరిశోధన కోసం నమూనాలను తీసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ వేరియంట్లను గుర్తించినప్పటి నుంచి నమూనాల నిష్పత్తిని పెంచామని వారు పేర్కొన్నారు. సాధారణ కరోనా వైరస్ వ్యాపించినపుడు 25 నుంచి 65 శాతం రోగ నిరోధకశక్తిని ప్రజలు కోల్పోతారని తెలిపారు. దీనివల్ల తిరిగి వైరస్ సోకేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వారు తెలిపారు.
యూకే రకం ఎక్కువ ప్రమాదకారి అని భావిస్తున్న నేపథ్యంలో బ్రెజిల్ రకం దానికన్నా ఎక్కువ త్వరగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్లో బ్రెజిల్ రకం కరోనా ఒకరికి సోకగా, అమెరికాలో 10 మందికి సోకింది. మరోవైపు బ్రెజిల్లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇటీవల జరుగుతున్న పలు వేడుకల కారణంగా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.