
తాజా వార్తలు
రామతీర్థం ఘటన ఓ హెచ్చరిక: చినజీయర్ స్వామి
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడ కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు. అయితే చినజీయర్ స్వామి రామతీర్థం పర్యటనను దేవాదాయశాఖ గోప్యంగా ఉంచడం గమనార్హం.
అనంతరం చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో ఏమాత్రం వసతులు లేని పరిస్థితిని మార్చాల్సి ఉందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఈ నేపథ్యంలోనే రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు చేసినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాల దర్శన యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ఘటనల తీరు, లోపాలను తెలుసుకునేందుకే పర్యటన చేస్తున్నట్లు వివరించారు. లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు సూచిస్తామని చినజీయర్ స్వామి తెలిపారు. అలాగే ఈ ఘటనలను హెచ్చరికగా తీసుకొని రాష్ట్రంలోని మారుమూల ఆలయాలను గుర్తించి ఏడాదిలోగా తగిన సదుపాయాలు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని.. భక్తులు నిత్యం వచ్చేలా ఆలయాలను తీర్చిదిద్దాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల్లోనూ భక్తిభావం ఉండాలని త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు.
ఇదీ చదవండి..