
తాజా వార్తలు
నిరుద్యోగులు అసంతృప్తితో లేరు: కేటీఆర్
హైదరాబాద్: న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్యలు బాధ కలిగించాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తొలగించినట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన తెరాస లీగల్ సెల్ సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హత్యతో ప్రమేయం ఉన్నవారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని.. న్యాయవాదులకు తెరాస రక్షణగా ఉంటుందని ఆయన చెప్పారు. న్యాయవాదుల రక్షణకు చట్టం కోసం కృషి చేస్తామన్నారు.
కొత్త పీఆర్సీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
వామన్రావు దంపతుల హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లతో తమ ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. న్యాయవాదులకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో పీవీ నరసింహారావును పట్టించుకున్న దాఖలాలు లేవని.. ఆయనకు తెరాస ప్రభుత్వం గౌరవం ఇస్తోందని చెప్పారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారనేది అవాస్తవమన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కొత్త పీఆర్సీపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.