
తాజా వార్తలు
పోలేపల్లి సెజ్లో ఉల్లంఘనలపై విచారణ
దిల్లీ: తెలంగాణలోని పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై జాతీయ హరిత ట్రైబ్యునల్లో శుక్రవారం విచారణ జరిగింది. అనుమతులు ఉల్లంఘించిన 9 ఔషధ సంస్థలకు జరిమానా విధించినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ట్రైబ్యునల్కు నివేదించింది. హెటిరో ల్యాబ్స్, శిల్పా మెడికేర్, అరబిందో ఫార్మా, ఏపీఎల్ హెల్త్ కేర్, మైదాన్ లాబొరేటరీస్, ఎవెర్టోజెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమ్నీల్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రూ.18.25 లక్షలు, శ్రీకార్తికేయ ఫార్మా కంపెనీకి రూ.9లక్షల జరిమానా విధించినట్లే తెలంగాణ కాలుష్య నియంత్రణమండలి స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతుల ఉల్లంఘన రుసుమును 365 ఉల్లంఘన దినాలకు మాత్రమే వర్తింపజేయడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 2013 నుంచే కాలుష్యం వెదజల్లుతున్నా దృష్టి సారించలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్.. కాలుష్య కంపెనీలపై ఎందుకు ఉదాసీనత కనబరిచారని తెలంగాణ పీసీబీని ప్రశ్నించారు. పరిశ్రమలతో చర్చించిన తర్వాత 365 ఉల్లంఘన దినాలకు అపరాధ రుసుం విధించినట్టు తెలంగాణ పీసీబీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఉల్లంఘనలు గుర్తించిన అన్ని రోజులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి...
కేంద్రం-రైతు సంఘాల చర్చలు షురూ!
శంషాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సేవలు