
తాజా వార్తలు
మోదీకి నమ్మకస్తుడైన ఆ అధికారి భాజపాలోకి..
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తులైన అధికారుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ శర్మ భాజపాలో చేరారు. యూపీలోని లఖ్నవూలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ దళంలోకి చేరుతున్న ఆయనకు భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శర్మకు ఎమ్మెల్సీ పదవితో పాటు ఉత్తర్ ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28న రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ శర్మ.. ఇటీవలే వీఆర్ఎస్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 2001లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అలాగే, గుజరాత్ మౌలిక సదుపాయాల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్గానూ ఉన్నారు. అనంతరం 2014లో భాజపా అఖండ విజయంతో , ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లోకి వచ్చారు. కరోనా లాక్డౌన్తో తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న సమయంలో గతేడాది మే నెలలో శర్మ ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు బదిలీపై వెళ్లారు.
ఇదీ చదవండి..