
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. 10 నెలల అప్పు.. రూ.73,913 కోట్లు!
రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్ మంగళవారం రాత్రి విడుదల చేసింది. జనవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో రూ.73,912.91 కోట్లను అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ అంచనాలతో పోలిస్తే ఇది రెట్టింపును దాటిపోయింది. కరోనా వల్ల రెవెన్యూ ఆదాయం తగ్గిపోవడంతో ప్రారంభంలో అప్పులు చేయక తప్పలేదని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నా, రెవెన్యూ రాబడి గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇప్పుడు ఎక్కువేనని కాగ్ లెక్కలే అంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పసుపు.. మెరుపు
వంగడం తమిళనాడుది... పండించింది కర్ణాటక రైతు.. రికార్డు ధర మహారాష్ట్ర మార్కెట్లో... పై చిత్రంలోని రైతు పేరు రామప్ప బసప్ప నేమగౌడర్. ఊరు కర్ణాటకలోని బెళగావి జిల్లా గుర్లాపూర్. ఈయన ఎకరా విస్తీర్ణంలో తమిళనాడు సేలం రకం పసుపు వంగడంతో 10 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. 3.50 క్వింటాళ్ల పసుపు కొమ్ములను శుద్ధి చేసి, మంగళవారం మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్కు తీసుకురాగా, వ్యాపారులు క్వింటా రూ.30 వేల ధరకు కొన్నారు. మూడున్నర క్వింటాళ్లకే రూ.1.05 లక్షలు వచ్చాయని రైతు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మూతబడినా.. వాత పెడుతున్నారు
కరోనా ప్రభావం వేలాది మంది విద్యార్థులపై పడింది. వందలాది ప్రైవేటు పాఠశాలలను అర్ధాంతరంగా మూసి వేయడంతో వాటిలో చదువుతున్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తమకు పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని, పాసైనట్లు సర్టిఫికెట్ సైతం ఇస్తామంటూ చెబుతుండడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో పెద్దఎత్తున ఆందోళన నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై ‘ఈనాడు’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించినపుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* పాఠాలు ఒకప్పుడు.. పనిపాటల్లో ఇప్పుడు
4. విస్తరిస్తున్న చైనా టీకా దౌత్యం!
ప్రపంచవ్యాప్తంగా చైనా టీకా దౌత్యం అద్భుతంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 45 దేశాలకు దాదాపు 50 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ను సరఫరా చేస్తామని డ్రాగన్ ఇప్పటికే హామీ ఇచ్చింది. ఆ దేశం ఉత్పత్తి చేసిన టీకాలకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి డేటా అందుబాటులో లేకపోవడం, వాటి సమర్థత, భద్రతపై అనుమానాలు ఉండటం, వ్యాక్సిన్లు సరఫరాకు ప్రత్యుపకారంగా చైనా ఏం కోరబోతోందన్నదానిపై సంశయాలు నెలకొన్నప్పటికీ ఈ పరిస్థితి ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఎమర్జెన్సీ విధింపు పొరపాటే: రాహుల్
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) ముమ్మాటికీ పొరపాటేనని, ఆమె మనుమడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ మాజీ ఆర్ధిక సలహాదారు, కార్నెల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కౌశిక్ బసుతో మంగళవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో రాహుల్ ఈ విషయాన్ని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడంతో పాటు రాజ్యాంగాన్ని అందించి, సమానత్వం కోసం నిలబడిన కాంగ్రెస్కు చెందిన వ్యక్తిగా... పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు కలెక్టర్లకు 3 నెలల జైలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణభాస్కర్, అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా (ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్), భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావులకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 11 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆ పలకరింపులకై అన్వేషణ!
అనంత విశ్వం.. భూమిపై మనం. నక్షత్ర వ్యవస్థల నుంచి కాంతి వేగంతో అంతుచిక్కని సంకేతాలు!! అవి మనల్ని పలకరించేందుకేనా? విశ్వంలో ఎక్కడైనా మనలాంటి బుద్ధి జీవులు ఉన్నారా? ఉంటే.. మనతో ఏదైనా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా?.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఫలితంగా గ్రహాలు దాటుకుని మనిషి విశ్లేషణ నక్షత్ర మండలాల వరకూ చేరుకుంది. ఇదిలా ఉండగా.. మన పొరుగు గ్రహమైన అంగారకుడిపైనే అందరి దృష్టి పడింది. ఇప్పుడు నాసా పంపిన పర్సెవరెన్స్ మార్స్పై దిగి మరిన్ని విశ్లేషణలు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో జీవరాశి జాడలపై మరింత ఆసక్తి నెలకొంది! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. బైక్ బ్యాటరీల ఛార్జింగ్ 15 నిమిషాల్లోపే
ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోపే పూర్తిగా ఛార్జింగ్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘లాగ్ 9 మెటీరియల్స్’ ఆవిష్కరించింది. వేగంగా ఛార్జింగ్ అయ్యే బ్యాటరీని అభివృద్ధి చేయడానికి సూపర్కెపాసిటర్ టెక్నాలజీ, ‘గ్రాఫీన్’ను వినియోగించినట్లు లాగ్ 9 బృందం వెల్లడించింది. ఈ బ్యాటరీని ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేసేందుకు 15 నిముషాల కంటే తక్కువ సమయమే సరిపోతుందని, 15 ఏళ్లకు పైగా పనిచేస్తాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అప్పుడే కెమెరాతో ప్రేమలో పడ్డా
‘‘నటిగా ఫలానా పాత్రలే చేయాలని పరిమితులేమీ పెట్టుకోలేదు. అన్ని రకాల జానర్లలో నటించాలనుంది. విభిన్న రకాల పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాలనుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’ చిత్రంతో వెండితెరపై మెరవనున్న తెలుగు అందం ఆమె. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమిది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అనుదీప్ దర్శకుడు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు ఫరియా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రికార్డుల ముంగిట కోహ్లి
రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లి.. ఇంగ్లాండ్తో చివరి టెస్టులో కొన్ని ఘనతలు అందుకునే అవకాశాలున్నాయి. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్ ధోని (60 టెస్టులు) రికార్డును అహ్మదాబాద్లో అతను సమం చేయనున్నాడు. కెప్టెన్గానే కాదు బ్యాట్స్మన్గా కూడా కొన్ని రికార్డులు విరాట్ ముంగిట ఉన్నాయి. అతడు మరో 17 పరుగులు చేస్తే కెప్టెన్గా 12,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతనికన్నా ముందు రికీ పాంటింగ్ (15,440), గ్రేమ్ స్మిత్ మాత్రమే (14,878) ఈ ఘనత సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి