
తాజా వార్తలు
‘వాజే’కీయ ప్రకంపనలు
మహా సర్కారును కుదిపేస్తున్న ‘హఫ్తా’ ఆరోపణలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అంబానీకి బెదిరింపులు- మన్సుఖ్ హిరేన్ హత్య కేసు చినికి చినికి గాలివానగా మారుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే కొద్దీ దిగ్ర్భాంతి గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవి మహారాష్ట్ర పోలీసుశాఖకు అప్రతిష్ఠ తేవడంతో పాటు, రాజకీయంగా కూడా సర్కారును ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కేసు కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వరకూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సచిన్ వాజే న్యాయస్థానానికి ఓ లేఖ ఇవ్వబోవడం.. ఆ లేఖలో మరికొందరు రాజకీయ ప్రముఖుల పేర్లను కీలకంగా ప్రస్తావించడంతో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. దీనికి సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. ఎక్కడ ఆగుతుందో అని మహా రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
ఏఐపీ పునర్నియామకంపై విమర్శలు..
సచిన్ వాజే నియామకం తొలి నుంచీ రాజకీయ రంగు పులుముకొంది. కరోనా సమయంలో పోలీసు బలగాలు అవసరం కావడంతో సస్పెన్షన్లో ఉన్నవారిని విధుల్లోకి తీసుకోవాలనే నిర్ణయం వాజేకు కలిసొచ్చింది. వాజేను తీసుకోవడంలో నాటి సీపీ పరమ్బీర్ సింగ్ పాత్ర చాలా ఉంది. ఘాట్కోపర్ పేలుళ్ల కేసులో అనుమానితుడు ఖ్వాజా యూనిస్ లాకప్ డెత్ కేసులో వాజే 2004లో సస్పెండ్ అయ్యాడు. అతడిని మళ్లీ 2020లో విధుల్లోకి తీసుకోవడంపై ఖ్వాజా కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ, పోలీసులు తమ నిర్ణయాన్ని సమర్థించుకొని వాజేకు పోస్టింగ్ కొనసాగించారు. లోకల్ ఆర్మ్స్ యూనిట్లో పోస్టింగ్తో తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టిన వాజేను కొన్ని రోజుల్లోనే కీలకమైన క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు మార్చేశారు. నాటి క్రైమ్ విభాగానికి చెందిన జాయింట్ సీపీ మిలింద్ బరాంబే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు నిన్న ముంబయి పోలీస్ కమిషన్ హేమంత్ నగ్రాలే సమర్పించిన నివేదికలో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. సచిన్ వాజేను కేవలం నాటి సీపీ పరమ్బీర్ సింగ్ మౌఖిక ఆదేశాలతోనే క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు అధిపతిని చేసినట్లు తేలింది. వాస్తవానికి ఈ విభాగానికి ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి నాయకత్వం వహించాలి. కానీ, వాజే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మాత్రమే. ఈ అంశాలన్నీ ముంబయి పోలీస్ విభాగంలో డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి.
వాజే ఆడిందే ఆట..
సచిన్ వాజే తన పై అధికారులను ఎవరినీ పట్టించుకోకుండా నేరుగా సీపీ పరమ్బీర్ సింగ్కు మాత్రమే రిపోర్టు చేసినట్లు తేలింది. అక్కడి నుంచి మార్గదర్శకాలు తీసుకొని పనిచేసేవాడు. క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్కు టాటాసుమో, ఇన్నోవా, స్కార్పియో వాహనాలు ఉన్నాయి. కానీ, సచిన్ వాజే మాత్రం ఆఫీస్కు మెర్సెడెస్ బెంజ్, ఆడీ వంటి విలాసవంతంమైన కార్లలో వచ్చేవాడు. తాజాగా అంబానీ ఇంటి వద్ద ఉంచిన స్కార్పియోను కూడా చివరి వరకు తన కార్యాలయంలోనే ఓ మూల ఉంచినట్లు తేలింది. ఆఫీస్కు చెందిన ఇన్నోవానే బాంబు అమర్చే సమయంలో కూడా వినియోగించాడంటే.. అతడిలో ‘ఏమీ కాదులే’ అనే భరోసా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుబేరులే కుళ్లుకొనేలా లగ్జరీ కార్లు..
ఈ మొత్తం కేసులో సచిన్ వాజే వాడిన లగ్జరీ కార్లను చూసి ఎన్ఐఏ అధికారులే అవాక్కయ్యారు. ఈ కేసులో మొత్తం మూడు బెంజి స్పోర్ట్స్ కార్లు, ఒక వోల్వో, ఒక టయోటా ప్రాడో, ఒక మిత్సింబిషి ఔట్ ల్యాండర్, ఒక ఆడీ, ఒక స్కోడా కారును స్వాధీనం చేసుకొన్నాయి. ఇవి కాకుండా ఒక స్కార్పియో, ఇన్నోవా, మారుతీఎకో వాహనాలను కూడా సీజ్ చేశాయి. వాజేకు సహకరించిన ఓ మహిళ వద్ద నుంచి రూ.7లక్షలు విలువైన బైక్ను కూడా స్వాధీనం చేసుకొన్నారు. దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. ఎన్ఐఏ ఇంటరాగేషన్లో తాను ఆటోమేటిక్ గేర్ వాహనాలను మాత్రమే నడపగలనని వాజే పేర్కొనడం విశేషం.
అంతేకాదు వాజే బస చేయడానికి ఓ ఐదు నక్షత్రాల హోటల్లో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఓ వ్యాపార వేత్త రూ.12లక్షలు చెల్లించి 100 రోజులపాటు గదిని బుక్ చేశాడు. ఈ హోటల్కు వచ్చిన సమయంలో వాజే తెచ్చిన బ్యాగుల నిండా డబ్బులు ఉన్నట్లు హోటల్ ఎక్స్రే యంత్రాల్లో స్పష్టంగా కనిపించిందని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ హవా ఈ స్థాయిలో నడవడానికి రాజకీయ బంధాలే కారణమని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
కేసు నుంచి దూరం జరుగుతున్న నాయకులు..
వాజే వసూళ్ల కేసులో రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తుండటంతో అధినాయకత్వాలు దూరం జరుగుతున్నాయి. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా సచిన్ వాజేను సమర్థించినా.. బాంబు బెదిరింపుల కేసులో వాజే పాత్ర బయటపడ్డాక దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛను ఇచ్చారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ ఈ కేసులో కీలక విషయాలను బయటపెట్టి సర్కారుపై ఆరోపణలు చేయడం ఇరుకున పెట్టింది.
ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముంబయి కమిషనర్ పరమ్బీర్ సింగ్ను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడంతో మరో కొత్త వివాదానికి బీజం పడింది. ఆ తర్వాత పరమ్బీర్ సింగ్ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ స్వయంగా వాజేను పిలిచి రూ.100 కోట్లు వసూలు చేయమన్నారంటూ అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో పరమ్బీర్ సింగ్ ప్రస్తావించిన తేదీల్లో అనిల్ దేశ్ముఖ్ కరోనాతో బాధపడుతున్నారని ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్వయంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అనిల్ దేశ్ముఖ్ పర్యటన వివరాలు, విలేకర్లతో మాట్లాడిన అంశాలు బయటకు రావడంతో ఆయన మౌనం పాటించారు. ఈ క్రమంలో పరమ్బీర్ సింగ్ సుప్రీం కోర్టును.. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు కోరారు. అదే సమయంలో మరికొందరు కూడా అనిల్ దేశ్ముఖ్ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించింది.
మరోపక్క నిన్నటితో సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడి ముగియడంతో నిన్నే న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సచిన్ వాజే ఎన్ఐఏకు రాసిన నాలుగు పేజీల సంచలనం సృష్టించింది. దీనిలో అనిల్ దేశ్ముఖ్తో సహా, అనిల్ పరాబ్(శివసేన), అజిత్ పవార్ కీలక సహాయకుడి పేర్లను ప్రస్తావించాడు. తనకు పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.2 కోట్లు కోరడంతో పాటు.. ఇతర వసూళ్లకు పురమాయించారన్నది ఈ లేఖ సారాంశం. ఇవన్నీ పరంబీర్కు సింగ్కు కూడా తెలుసని వాజే పేర్కొన్నాడు. దీనిపై ఇప్పటి వరకు సేన నేత సంజయ్ రౌత్ మాత్రమే స్పందించారు. మిగిలిన పార్టీలు మౌనంగా ఉన్నాయి.