News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 19 May 2022 02:31 IST
1/23
మూడు గదుల రేకుల ఇల్లు.. ఓ ఫ్యాన్, టీవీ, రెండు విద్యుత్తు బల్బులు... బిల్లు చూస్తే రూ.7,02,825! ఇదేమిటని అడిగితే
సమాధానమివ్వని బిల్లు కలెక్టర్. ఇదీ.. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్కు ఇటీవల ఎదురైన అనుభవం.
ఆయన నివాసానికి సంబంధించి మీటరుకు మే నెలలో అక్షరాలా రూ.7.02 లక్షల బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. ఏప్రిల్ వరకు నెలకు
సగటున రూ.400 వరకు బిల్లు వచ్చేది. ఇదేంది సారూ.. ఎలా సరిదిద్దుతారు? అని అడిగేందుకు స్థానిక బిల్లు కలెక్టర్ను సంప్రదిస్తే సరైన
సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారని సంపత్ వాపోయారు. తప్పుల తడక బిల్లులతో హైరానా పెట్టడం సరికాదని.. అధికారులు బిల్లు
సరిచేయాలని బాధిత వినియోగదారుడు కోరుతున్నాడు.
2/23
చేతవెన్నముద్ద.. చెంగల్వ పూదండ.. బంగారు మొలతాడు అంటూ శ్రీకృష్ణున్ని కొలిచే పాట విన్నారు కదా అందులో చెంగల్వ పూదండను
ఎప్పుడైనా చూశారా..? చాలా అరుదుగా కనిపించే ఈ పుష్పం ప్రస్తుతం గోదావరిఖనిలోని ఓ సింగరేణీయుని ఇంట్లో వికసించింది. ఆర్జీ-2
డివిజన్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించే జగన్మోహన్రెడ్డి సతీమణి స్వర్ణలత ఈ మొక్కను ఐదేళ్లుగా పెంచుతున్నారు.
మంగళవారం రెండు పుష్పాలు వికసించి కనువిందు చేసింది. ఈ మొక్క మే నుంచి ఆగస్టు మధ్యలో కొన్ని పూలు మాత్రమే పూస్తుంది.
పుష్పాన్ని తెంపిన వారం రోజుల వరకు తాజాగా ఉండడం విశేషం. శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైన పుష్పంగా పురాణాల్లో ఉండడంతో
చూసేందుకు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
3/23
రోజురోజుకు భానుడి ప్రతాపంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు కూడా వేడిమి నుంచి ఉపశమనం ఇవ్వడం లేదు. ఈ
పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన విశ్రాంత వీఆర్వో గండ్ర నర్సింగరావు తన ఇంటి చుట్టూ నీటి తుంపర్లు పడేలా
అమర్చుకుని ఉపశమనం పొందుతున్నారు.. ప్రత్యేక మోటారు ద్వారా ఉపరితల ట్యాంకు నుంచి పొగ మంచును తలపించే రీతిలో నీరు
పిచికారి అవుతోంది. ఫలితంగా పరిసరాలన్నీ చల్లగా మారుతున్నాయి. 29 పిచికారీ పాయింట్లను ఏర్పాటు చేసుకున్నారు. గంటకు సుమారు
వంద లీటర్ల నీరు పిచికారి అవుతోందని ఆయన తెలిపారు. చల్లదనంతో పాటు పరిసరాల్లోని చెట్లకు నీరు అందుతోందని పేర్కొన్నారు.
4/23
వైశాఖ మాసంలో వచ్చే బుద్ధ పూర్ణిమ మరుసటి రోజు నుంచి ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం పెర్సాపెన్
పూజలు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో పెర్సాపెన్ దేవత పూజల పండగ వాతావరణం నెలకొంది. ఇప్ప
చెట్లపై కొలువు దీరి ఉన్న పెర్సాపెన్ దేవతలను ఆదివాసీల అల్లుళ్లు చెట్లు ఎక్కి కిందకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
5/23
ఈ చిత్రం చూస్తుంటే మన్యంలో తెల్లవారుజామున సూరీడి లేలేత కిరణాలు నేలకు సోకుతున్నట్లు అనుకునేరు. భగభగలతో అందరికీ
భానుడు దడపుట్టిస్తున్నా.. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల మధ్యలోకి వచ్చేసరికి ఇలా పండు వెన్నెల కాంతిలా మారింది. వాహన
చోదకులకు, ప్రకృతి ప్రేమికులకు ఆనందంలో తేలిపోయేలా చేసింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం- మండపేట రహదారిలో
బుధవారం కనిపించిన దృశ్యమిది.
6/23
కడుపు నింపుకొనేందుకు వరాహాలు గోవు పాలు తాగుతున్నాయి. ఆవు వద్దకు వెళ్లి పందులు పాలు తాగుతున్నా.. గోవు కూడా ఏమీ
అనకుండా పాలుపంచుతోంది. పత్తికొండ పట్టణంలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది.
7/23
మొక్కలపై ఉన్న ప్రేమ ఆ ఇంటికి అందాన్ని తీసుకొచ్చింది. కుటుంబానికి ఆహ్లాదం కలిగిస్తోంది. ఏకంగా మూడంతస్తుల మేడకు పూలతో
కూడిన పచ్చని గోడ కట్టేలా చేసింది. కోవూరు నియోజకవర్గం పాటూరులోని ఆ ఇంటిని చూసిన వారు అబ్బురపడుతున్నారు. ఇంటి చుట్టూ
నాటిన కాగితపు పూల చెట్ల కొమ్మలను సొగసుగా మూడంతస్తుల వరకు చక్కగా తీర్చిదిద్దడాన్ని తిలకించి ఔరా అంటుండగా- యజమాని
పెండెం వెంకటశేషయ్య తమ మూడేళ్ల కష్టమే ఇంతటి అందం.. ఆహ్లాదం తెచ్చిందని చెబుతున్నారు.
8/23
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం నీటితో నిండిపోయింది. బస్సులు బయటకు వెళ్లే దారిలో
సుమారు అడుగులోతు వరకు వర్షపు నీరు, మురుగు నిలిచింది. కాలువలు చెత్తతో నిండిపోవడంతో నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి
ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సాయంత్రం ఆర్టీసీ అధికారులు, కార్పొరేషన్
సిబ్బంది కలిసి కాలువలోని చెత్త తొలగించారు.
9/23
రేగిడిలోని మండల పరిషత్తు మండువాలో ఉన్న ఈ పనస చెట్టు మొదలుకే బోలెడు కాయలు కాశాయి. నేలను తాకుతూ ఒకే గెలగా ఉన్న
దీనికి 12 కాయలు వరకు ఉన్నాయి. పైన కాండానికి కూడా కొన్ని కాశాయి. దీంతో కార్యాలయానికి వచ్చే వారు ఆసక్తిగా చూస్తున్నారు.
10/23
కర్తరి పోటు ఎక్కువగా ఉండటంతో బుధవారం సముద్ర అలల ఉద్ధృతికి పెదమైనవానిలంక తీరంలో కోత ఎక్కువైంది. అలలు ఉవ్వెత్తున
ఎగసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రభావంతో తీరం వెంబడి కేపీపాలెం సౌత్, పీఎం లంకలో కొబ్బరి,
సర్వి, తాటిచెట్లు నేలకొరిగాయి. పీఎం లంకలో సముద్రం ఒడ్డున నిర్మించిన శివాలయం కొట్టుకుపోకుండా రక్షణగా స్థానికులు రాళ్లు, మట్టిని
ట్రాక్టర్లతో తీసుకొచ్చి వేస్తున్నారు. మూడు రోజుల నుంచి పౌర్ణమి, కర్తరి పోటుతో వస్తున్న అలల తీవ్రతను చూస్తుంటే గ్రామాలపైకి సముద్రం
వచ్చిపడుతుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
11/23
వేసవిలో వర్షం వచ్చే ముందు ఆకాశంలో కనిపించే అద్భుతాల్లో హరివిల్లు ఒకటి. బుధవారం సాయంత్రం వాతావరణంలో వచ్చిన మార్పుతో
ఎండ, మబ్బులుగా ఏర్పడిన నింగిలో ఒక్కసారిగా హరివిల్లు విరబూసింది. యలమంచిలి మండలం గుంపర్రు-ఆచంట మండలం వల్లూరు
పరిధిలోని నీరుల్లిపాలెంలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను కనువిందు చేసింది.
12/23
కౌతాళం మండలం అగసలదిన్నెలో 400 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో బోరు బావులు వేసినా నీళ్లు రాకపోవడంతో శివారులో
లింగాలదిన్నె వద్ద బోరు బావి తవ్వించారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి గ్రామంలోని రెండు ట్యాంకుల్లో
నింపుతున్నారు. ఇంటింటికి కుళాయిలు లేవు.. విద్యుత్తు ఉన్న సమయంలోనే మంచినీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులు
ప్రత్యేకంగా బండ్లు కొనుగోలు చేశారు. వాటిలో బిందెలు పెట్టి ట్యాంకుల వద్ద గంటల తరబడి నిరీక్షించి నీటిని తెచ్చుకొంటున్నారు.
13/23
సరిహద్దులో వారధి అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులు పడుతున్న అవస్థలివి. నందవరం మండలం నాలుగదిన్నె వద్ద రెండు తెలుగు
రాష్ట్రాల మధ్య ఉన్న వంతెన 2009లో భారీ వరదలకు తెగిపోయింది. రూ.39 కోట్లతో నిర్మించాలని 2012లో నిర్ణయించారు. 2016 చివరి
నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. తెలంగాణ వైపు నుంచి అనుమతులు రాకపోవడం... సామగ్రి, ఇతర ధరలు పెరగడంతో
గుత్తేదారు అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. సగం వరకు వంతెన నిర్మించారు. దీంతో చేసేది లేక ప్రయాణికులు ఇనుప మెట్ల సాయంతో
వంతెన పైకి చేరుకొని అక్కడి నుంచి సరిహద్దు దాటుతున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని పులికల్లో దేవర ఉత్సవం ఉండడంతో
జనం పెద్ద ఎత్తున తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మెట్లపై ఎక్కి వెళ్లారు.
14/23
పల్నాడు జిల్లా దుర్గిలోని గూడా శ్రీనివాసరావు కిరాణా దుకాణానికి బుధవారం కోళ్లఫారం నుంచి కొన్ని కోడిగుడ్లు వచ్చాయి. వాటిలో ఒకటి
మామిడికాయ ఆకారం పోలి ఉంది. ఈ విషయమై పశు వైద్యుడు ప్రణీత్ను సంప్రదించగా.. జన్యు లోపాలతో ఇటువంటివి అరుదుగా
జరుగుతుంటాయని తెలిపారు.
15/23
ఉద్యానవనంలో పురివిప్పి .. అందంగా కళ్లకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ నెమలి నిజమైనది కాదు. పనికిరాని ఇనుప వస్తువులను
పడేయకుండా స్క్రాబ్ శిల్ప చిత్రాలను ఆవిష్కరింపచేస్తున్నారు. పాడయిన ఇనుప వస్తువులు, వాహనాలను వృథాగా వదిలేయకుండా.. వాటి
విడిభాగాలతో ఇలా అందమైన నెమలి చిత్రాన్ని తయారుచేశారు. విజయవాడ రాజీవ్పార్కులో అందరినీ ఆకట్టుకుంటోంది.
16/23
సాధారణంగా తోటకూర మొక్క మూడడుగులు.. పోషకాలు బాగా అందితే నాలుగైదు అడుగులు పెరుగుతుంది. కానీ ఆ మిద్దెపై నాటిన
తోటకూర ఏకంగా పది అడుగులకు పైగా పెరిగింది. భవానీపురం ఉద్దంటివారి వీధిలో నివాసం ఉండే విశ్రాంత అధ్యాపకుడు వేదాంతం
భోగేంద్రాచార్యులు డాబాపై మొక్కలు, ఆకుకూరలు పెంచుతున్నారు. నిత్యం ఇంట్లో వచ్చే కూరగాయల వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా
వేయడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయని భోగేంద్రాచార్యులు తెలిపారు. అలా తోటకూర పది అడుగుల ఎత్తుకు ఎదిగిందని
చెప్పారు.
17/23
దివ్యాంగులకు ఇవ్వాల్సిన ట్రైసైకిళ్లు పంపిణీకి నోచుకోవడం లేదు. దీంతో గుంటూరులోని ప్రత్యేక ప్రతిభావంతుల వసతి గృహ ఆవరణలో
ఉంచిన ట్రైసైకిళ్ల చుట్టూ ముళ్ల పొదలు పెరిగి తుప్పుపట్టిపోతున్నాయి. మరోవైపు ట్రైసైకిళ్లు కావాలంటూ జిల్లాకు చెందిన పలువురు
దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వారికి పంపిణీ చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
18/23
నిమ్స్ ఆసుపత్రిలో రోగుల నిరీక్షణకు అద్దం పడుతున్న చిత్రాలివి. నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా రోగులు ఈ దవాఖానాకు బారులు తీరుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలోని శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒకరోజు ముందే నగరానికి చేరుకుంటున్నారు. వేకువజాము నుంచే ఆసుపత్రి వద్ద వేచి ఉంటున్నారు. ఇలా వచ్చేవారిలో న్యూరాలజీ, రుమటాలజీ రోగులు ఎక్కువగా ఉంటున్నారు. బయటి రోగుల(అవుట్ పేషెంట్-ఓపీ) విభాగంలో వైద్యులను సంప్రదించే గదుల ముందు బారులుతీరి కనిపిస్తున్నారు.
19/23
20/23
గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఈత కొలనులు ఈసారైనా పునఃప్రారంభిస్తే ఈత నేర్చుకోవాలన్న అభిలాషకు ఎంతోమంది పిల్లలు, పెద్దలు దూరం అవుతున్నారు. కొన్నిచోట్ల నీరే లేని దయనీయ పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో గత రెండున్నర సంవత్సరాలుగా వాడుకలో లేక వెలవెలబోతున్న స్విమ్మింగ్ పూల్ ఇది. కనీస సదుపాయాలనూ సమకూర్చలేని పరిస్థితి.
21/23
నాలుగు వందల ఏళ్ల క్రితం ఇబ్రహీం కులీకుతుబ్షా కాలంలో నిర్మించిన షేక్పేట మసీదు ఇది. ‘‘వారసత్వ కట్టడం.. నిర్లక్ష్యంతో శిథిలం!’’ శీర్షికతో ఈనాడు ప్రధాన పత్రికలో ప్రచురించిన చిత్ర కథనానికి స్పందించిన అధికారులు మసీదు ఆవరణలో నిండి ఉన్న చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి సంరక్షణ పనులు చేపట్టారు. చార్మినార్ను పోలి ఉండే ఈ మసీదు మినార్లకూ మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
22/23
కుందేళ్ల మాదిరిగా ముచ్చటగా కనిపిస్తున్న ఈ ప్రాణుల్ని గినియా పిగ్స్ అంటారు. కరీంనగర్లోని జింకల పార్కులో వీటిని పెంచుతున్నారు. విభిన్న వర్ణాల్లో ఉండటంతో ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్(జువాలజి) ఎన్. సంగీతారాణి వీటి గురించి వివరించారు. గినియా పిగ్స్ 16వ శతాబ్దం నుంచీ కనబడుతున్నాయని అన్నారు. ఇవి శాకాహారులని, తోకలుండవని వీటిని దక్షిణ అమెరికాలో ఇళ్లలో పెంచుకుంటారని ఆమె తెలిపారు.
23/23
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాచీన వస్తువులను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు