అటు కరోనా.. ఇటు డెంగీ

అసలే కరోనా కాలం. ఆపై జ్వరాల దెబ్బ. ముఖ్యంగా డెంగీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు నొప్పి మాత్రలనూ ఆశ్రయిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది.

Updated : 24 Aug 2021 05:50 IST

అసలే కరోనా కాలం. ఆపై జ్వరాల దెబ్బ. ముఖ్యంగా డెంగీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు నొప్పి మాత్రలనూ ఆశ్రయిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది.

కొవిడ్‌.. కొవిడ్‌.. కొవిడ్‌. గత 18 నెలల నుంచీ అందరి నోటా ఇదే మాట. అదేంటో గానీ ఈ ఏడాదిన్నరలో కొవిడ్‌-19 తప్ప ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లేవీ అంతగా కనిపించలేదు. ఆసుపత్రుల్లో చేరినవారిలో నూటికి 99% మంది కరోనా బాధితులే. ఒకప్పటిలా డెంగీ, మలేరియా, వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్‌ వంటివి విజృంభించలేదు. చేతుల శుభ్రత, బయటకు అంతగా రాకపోవటం, మాస్కులు ధరించటం, ఇంటి ఆహారమే తినటం, పరిసరాల్లో దోమలు పెరగకుండా చూసుకోవటం వంటి జాగ్రత్తలు దీనికి కారణం కావొచ్చు. అయితే ఇటీవల కొవిడ్‌ రెండో దశ తగ్గుముఖం పట్టే సమయంలో డెంగీ జ్వరాలు పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది. కొవిడ్‌-19, డెంగీ రెండింటిలోనూ తొలిదశలో దగ్గు తప్ప జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి. కొందరిలో ఒకేసారి డెంగీ, కొవిడ్‌-19 రెండూ కలిసి ఉంటున్నాయి కూడా. డెంగీ ఒక్కటే కాదు.. వర్షాకాలంలో విజృంభించే మామూలు ఫ్లూ, మలేరియా, స్క్రబ్‌ టైఫస్‌, లెప్టోస్పైరోసిస్‌ వంటివీ దాడిచేస్తున్నాయి. వీటిల్లోనూ జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు తలెత్తుతుంటాయి. జ్వరం అనగానే కొవిడే అని భయపడిపోతున్న రోజుల్లో వీటి తారతమ్యాలను గుర్తించి, మసలు కోవటం ఎంతైనా అవసరం.

డెంగీనా? కొవిడా?

ప్రస్తుతం కొవిడ్‌-19తో పాటు అందరినీ ఎక్కువగా భయపెడుతోంది డెంగీనే. దీనికి మూలం డెంగీ వైరస్‌లు. ఈడిస్‌ జాతి దోమలు కుట్టటం ద్వారా వ్యాపిస్తుంది. ఇక కొవిడ్‌-19కు మూలం సార్స్‌-కొవీ-2 వైరస్‌. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. తీవ్రతను బట్టి వీటి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.

* ఒక మాదిరి నుంచి మధ్యస్థ డెంగీలో- జ్వరం, కళ్ల వెనక నొప్పి, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, వాంతి, వికారం, దద్దు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోవటం కనిపిస్తాయి. తీవ్రమవుతున్నకొద్దీ- చర్మం మీద దద్దు, కడుపు నొప్పి, విడవకుండా వాంతులు, పొట్టలో నీరు చేరటం, నిస్సత్తువ, చిరాకు, కాలేయం పెద్దగా అవ్వటం తలెత్తుతుంటాయి. తీవ్ర దశలో- రక్తనాళాల్లోంచి ప్లాస్మా లీకవుతుంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఇది షాక్‌కు దారితీస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ప్లేట్‌లెట్లు బాగా పడిపోవటం వల్ల రక్తస్రావం కూడా కావొచ్చు. క్రమంగా కాలేయం, గుండె వంటి అవయవాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది.

* ఒక మాదిరి నుంచి మధ్యస్థ కొవిడ్‌-19లో- జ్వరం లేదా వణుకు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన పోవటం, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు కారటం, వాంతి, వికారం, విరేచనాల వంటివి కనిపిస్తాయి. తీవ్ర దశలో- ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోవటం, న్యుమోనియా, ఊపిరితిత్తులు విఫలం కావటం, అవయవాలు దెబ్బతినటం వంటివి తలెత్తుతాయి.

చికిత్స మారితే ప్రమాదం

జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలుంటే ముందుగా అది కొవిడా? డెంగీనా? లేదూ రెండు కలిసి ఉన్నాయా? అనేది కచ్చితంగా నిర్ధారణ చేశాకే చికిత్స ఆరంభించాలి. ఇది చాలా ముఖ్యం. వీటికి చేసే చికిత్సలు వేర్వేరు. డెంగీలో ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోయి, రక్తస్రావమయ్యే అవకాశముంది. కొవిడ్‌-19లో రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. అందుకే కొవిడ్‌-19లో రక్తం చిక్కబడకుండా చూసే హెపారిన్‌ వంటి మందులు ఇస్తారు. డెంగీలో రక్తం గడ్డకట్టే తీరు ఎలా ఉందో చూసుకుంటూ ప్లేట్‌లెట్లు బాగా పడిపోతే రక్తనాళం ద్వారా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం అటూఇటైనా ప్రమాదమే. కొవిడ్‌-19 చికిత్సను డెంగీకి ఇస్తే రక్తస్రావమై ప్రాణం మీదికి రావొచ్చు. డెంగీ చికిత్సను కొవిడ్‌-19 బాధితులకు ఇస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి, తగు పరీక్షల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

కొవిడ్‌, డెంగీ కలిసి ఉంటే?

కొవిడ్‌-19, డెంగీ రెండూ కలిసి ఉన్నప్పుడు దేని లక్షణాలు ఉద్ధృతంగా ఉన్నాయో చూసుకోవటం ప్రధానం. నిజానికిది చాలా క్లిష్టమైన పరిస్థితి. ప్లేట్‌లెట్లు తక్కువగా ఉంటే రక్తం గడ్డలను నివారించే (యాంటీకొయాగ్యులేషన్‌) మందులు ఇవ్వకూడదు. ప్లేట్‌లెట్లు మామూలుగా ఉండి, కొవిడ్‌-19 లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు- తరచూ డీడైమర్‌ పరీక్ష చేస్తూ నిశితంగా గమనించాల్సి ఉంటుంది. డీడైమర్‌ ఎక్కువగా ఉంటే తక్కువసేపు.. అంటే 6-8 గంటల పాటు పనిచేసే ఆన్‌ఫ్రాక్షన్డ్‌ హెపారిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్లేట్‌లెట్లు పడిపోతున్నట్టు అనిపిస్తే వెంటనే ఆపెయ్యటానికి వీలుంటుంది. దీనికి విరుగుడు మందూ అందుబాటులో ఉంది. డెంగీ జ్వరంలో ఒంట్లో ద్రవాల మోతాదు తగ్గకుండా చూసుకోవటం కీలకం. ఇందులో రక్తంలోని ప్లాస్మాద్రవం రక్తనాళాల్లోంచి బయటకు వచ్చి పొట్టలో చేరొచ్చు (అసైటిస్‌), ఊపిరితిత్తుల్లో చేరొచ్చు (ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌). ఇలా ద్రవం మోతాదు తగ్గటం వల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా రక్తపోటు పడిపోతుంది. ఇలాంటి సమయంలో మామూలు సెలైన్‌ ఎక్కిస్తే చాలు. అదే కొవిడ్‌-19లో అంతగా సెలైన్‌ ఎక్కించాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ ద్రవాలు ఇస్తే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదముంది. రక్తం గడ్డకట్టే తీరును తెలిపే పరీక్షలు రోజూ చేయాల్సి ఉంటుంది. డెంగీలో ఏపీటీటీ, కొవిడ్‌-19లో డీడైమర్‌ పరీక్ష చేస్తారు. వీటి ఫలితాలను బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది.

నివారణ మన చేతుల్లోనే

వర్షాకాలంలో వచ్చే జబ్బులకు చాలావరకు నీరు, ఆహారం కలుషితం కావటం.. దోమలు కుట్టటం, గాలి ద్వారా ఇన్‌ఫెక్షన్లు వ్యాపించటమే కారణం. ఇవన్నీ నివారించుకోదగినవే. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీ, మలేరియా, చికున్‌గన్యా  బారినపడకుండా కాపాడుకోవచ్చు. మాస్కు ధరిస్తే ఫ్లూ, జలుబు, కొవిడ్‌-19, ఇతరత్రా శ్వాసకోశ సమస్యలను నివారించుకోవచ్చు. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ను అరికట్టొచ్చు. మట్టిలో అడుగు పెట్టినప్పుడు చెప్పులు ధరించటం, నేల మీద పడుకోకుండా చూసుకోవటం ద్వారా స్క్రబ్‌టైఫస్‌ను నివారించుకోవచ్చు.

నొప్పి మందులు వద్దు

మనదగ్గర చాలామంది సొంతంగా మందులు కొనుక్కొని వాడుతుంటారు. ఏమాత్రం జ్వరం, ఒళ్లునొప్పులు అనిపించినా నొప్పిని తగ్గించే మందులు వేసుకుంటుంటారు. ఇది తగదు. డాక్టర్‌ సలహా లేకుండా నొప్పి మందులు, స్టిరాయిడ్లు, యాంటీబయోటిక్‌ మందులు వాడకూడదు. నొప్పి మందులు రక్తం గడ్డకట్టే ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. రక్తస్రావానికి దారితీస్తాయి. జ్వరం, నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు సరిపోతాయని తెలుసుకోవాలి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగొచ్చు.

* జ్వరంతో బాధపడుతుంటే ప్రస్తుతం కండరానికిచ్చే ఇంజెక్షన్లు తీసుకోవటం మంచిది కాదు. ఒకవేళ డెంగీ ఉన్నట్టయితే ఇంజెక్షన్‌ ఇచ్చినచోట రక్తం గూడుకట్టే (హెమటోమా) ప్రమాదముంది.


పరీక్షలు అత్యవసరం

డెంగీ, కొవిడ్‌-19 బాగా తీవ్రమైతే అన్ని అవయవాలూ దెబ్బతినే ప్రమాదముంది. డెంగీలో, మలేరియాలో, లెప్టోస్పైరోసిస్‌లో కామెర్లు తలెత్తే అవకాశముంది. లెప్టోస్పైరోసిస్‌లో తొలిదశలోనే కిడ్నీలు దెబ్బతినొచ్చు. కామెర్లు తలెత్తొచ్చు. మిగతా జబ్బుల్లో మొదట్లోనే కిడ్నీలు ప్రభావితం కావటం తక్కువ. కాబట్టి జ్వరాలకు సరైన చికిత్సను నిర్ణయించటానికి తగు పరీక్షలు చేయటం చాలా ముఖ్యం.

* సంపూర్ణ రక్త పరీక్ష (సీబీపీ): ఇన్‌ఫెక్షన్‌ రకాలను అంచనా వేయటానికిది బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. కొవిడ్‌-19లో తెల్ల రక్తకణాలు తగ్గుతుంటాయి. ప్లేట్‌లెట్లు అంతగా తగ్గకపోవచ్చు. ప్లేట్‌లెట్లు తగ్గితే డెంగీగా అనుమానించొచ్చు. ఇక స్క్రబ్‌టైఫస్‌, లెప్టోస్పైరోసిస్‌లో తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. ప్లేట్‌లెట్లు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు.

* నిర్ధారణ పరీక్షలు: సత్వరం ఫలితాన్ని తెలిపే నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మలేరియాకు ప్యారాసైట్‌ ఎఫ్‌ అండ్‌ వీ, డెంగీకి ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్షలు ఉన్నాయి. కొవిడ్‌-19కు సైతం వెంటనే ఫలితం తెలిపే పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటితో తొలి రోజుననే జబ్బులను గుర్తించొచ్చు. ఒకే సమయంలో రెండు, మూడు జబ్బులు కలిసి దాడిచేస్తున్న ప్రస్తుత తరుణంలో నిర్ధారణ పరీక్షలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఇతర ఇన్‌ఫెక్షన్లూ..

* జలుబు: దీనికి మూలం రైనో వైరస్‌ తరగతి వైరస్‌లు. ఇందులో ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు, ఒళ్లు నొప్పులు, అలసట, బడలిక, కొద్దిగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* ఫ్లూ జ్వరం: దీనికి కారణం ఫ్లూ వైరస్‌లు. ఇందులో 101 డిగ్రీల కన్నా ఎక్కువ జ్వరం, ఒళ్లునొప్పులు వేధిస్తాయి. గొంతునొప్పీ ఉండొచ్చు.

* మలేరియా: దోమలు తెచ్చిపెట్టే మరో సమస్య మలేరియా. ప్లాస్మోడియం జాతి పరాన్నజీవులు దీనికి మూలం. ఇందులో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో ఇబ్బంది, రోజు విడిచి రోజు జ్వరం, విపరీతమైన చలి వేధిస్తాయి.

* స్క్రబ్‌టైఫస్‌: దీనికి మూలం ఓరియెన్షియా షుషుగముషి అనే బ్యాక్టీరియా. ఇది తవిటి పురుగు కుట్టటం ద్వారా వ్యాపిస్తుంది. దీనిలో తలనొప్పి, జ్వరం, చలి, దద్దు వంటివి కనిపిస్తాయి.

* లెప్టోస్పైరోసిస్‌: ఇది ఎలుకల మూత్రంతో కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సంక్రమిస్తుంది. జ్వరం, విపరీతమైన తలనొప్పి, వణుకు, కండరాల నొప్పులు, వాంతులు, కళ్లు ఎర్రబడటం, విరేచనాలు, దద్దుర్లు దీని లక్షణాలు. ఇందులోనూ ప్లేట్‌లెట్లు తగ్గొచ్చు, కామెర్లు తలెత్తొచ్చు, కిడ్నీలు దెబ్బతినొచ్చు. దీంతో ఇది డెంగీ, టైఫాయిడ్‌, కామెర్ల జబ్బులుగా పొరపడటానికీ దారితీస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని