కరోనా టీకా తీసుకునేవారు నొప్పి మందులేసుకోవచ్చా?

కరోనా టీకా తీసుకునేవారు నొప్పి మందులు వేసుకోవద్దని, ప్రమాదకరంగా మారుతుందని కొందరు చెబుతున్నారు.

Published : 30 Mar 2021 00:10 IST

సమస్య - సలహా

సమస్య: కరోనా టీకా తీసుకునేవారు నొప్పి మందులు వేసుకోవద్దని, ప్రమాదకరంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా?

- పి.బి. లక్ష్మి, హైదరాబాద్‌

సలహా: కరోనా టీకా కూడా నిజం వైరస్‌ మాదిరిగానే రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీంతో తాత్కాలికంగా జ్వరం, కండరాల నొప్పులు, టీకా తీసుకున్న చోట నొప్పి వంటివి తలెత్తొచ్చు. ఇవి టీకా ప్రభావం చూపుతోందనటానికి సంకేతాలే. అయితే కొందరు టీకా వేయించుకోవటానికి ముందే నొప్పులు, జ్వరానికి భయపడి ఐబూప్రొఫెన్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. దీంతో రోగనిరోధక ప్రతిస్పందన తగ్గే అవకాశముందని, యాంటీబాడీలు అంతగా ఉత్పత్తి కావటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి టీకా తీసుకున్నాక జ్వరం, నొప్పుల వంటివి తలెత్తినా ప్రత్యేకించి నొప్పి మందుల అవసరం లేదు. మరీ ఎక్కువైతే వాడుకోవచ్చు గానీ అంత అవసరమేమీ రాదు. చాలావరకు పారాసిటమాల్‌ మాత్రలే సరిపోతాయి. అవసరమైతే వీటిని 650 మి.గ్రా. మోతాదులో ప్రతి 6 గంటలకు ఒకటి వేసుకోవచ్చు. నొప్పి మందులు వాడుకోవాలని ప్రముఖ ఆరోగ్యసంస్థలేవీ సిఫారసు చేయలేదు. పారాసిటమాల్‌తో ఫలితం కనిపించకపోతే నొప్పి మందులు వాడుకోవచ్చు. అందువల్ల అత్యవసరమైతేనే.. అదీ డాక్టర్‌ సలహా మేరకే తీసుకోవాలి. ఇప్పటికే ఇతరత్రా జబ్బుల కారణంగా నొప్పి మందులు వాడుకునేవారైతే ఆపాల్సిన అవసరం లేదు. ఇలాంటివారు డాక్టర్‌ అభిప్రాయం తీసుకోకుండా ఆపేయటం తగదు. టీకా వేయించుకున్నాక నొప్పి, జ్వరం తగ్గటానికి మందుల కన్నా ముందుగా కొన్ని చిట్కాలు పాటించటం మేలు. టీకా వేయించుకున్న చోట నొప్పి ఉంటే తరచూ చల్లటి, తడి బట్టతో అద్దుకోవచ్చు. జ్వరంగా అనిపిస్తే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. పలుచటి దుస్తులు ధరించాలి.

సమస్యలు పంపాల్సిన చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని