YSR raithu bharosa: రైతు కళ్లలో కాంతులు

రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు కళ్లలో వారం..

Updated : 27 Oct 2021 06:32 IST

ఒకేరోజు 3 పథకాల ద్వారా అన్నదాతలకు లబ్ధి

వారికిచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేస్తున్నాం

రైతు భరోసా, సున్నా వడ్డీ యంత్రసేవ కింద రూ.2,190 కోట్లు విడుదల

ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నగదు సాయం విడుదల సందర్భంగా క్యాంపు కార్యాలయంలో

నమూనా చెక్కును ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి,

మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు తదితరులు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు కళ్లలో వారం ముందే దీపావళి కాంతులను చూసేందుకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. రైతు భరోసా కింద రెండున్నరేళ్లలో దాదాపు రూ.18,777 కోట్లు ఇవ్వగలిగామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంనుంచి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (పంట రుణాలు), వైఎస్సార్‌ యంత్రసేవా పథకాల కింద లబ్ధిదారులకు నగదును వారి ఖాతాల్లో బటన్‌ నొక్కి జమ చేశారు.

ఆగస్టులో జమ చేసిన రూ.977 కోట్లుపోను మిగిలిన రూ.1,213 కోట్లను ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో ప్రస్తుతం వేశారు. దీంతో రైతులకు మొత్తం రూ.2,190 కోట్ల లబ్ధి చేకూరినట్లయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘సున్నా వడ్డీ కింద ఇప్పటివరకూ రూ.1,674 కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1,180 కోట్లతోపాటు తాము రూ.382 కోట్లు లోగడే ఇచ్చాం. ఇప్పుడు మరో రూ.112.7 కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 గ్రామస్థాయి యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం’ అని వెల్లడించారు. ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలను చూడడానికే ఈ రాష్ట్రానికి కేంద్ర బృందాలు వస్తే ఈ రోజు రైతుభరోసా కేంద్రాలను చూసేందుకు రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి బృందాలు వస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులను నాడు-నేడు కింద అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు.

గత ప్రభుత్వ బకాయిలనూ కట్టాం

రాష్ట్రంలో దాదాపు 18.7లక్షల మంది రైతులకు పగటి పూటే 9గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపు రూ.18వేల కోట్లను వెచ్చించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను మన ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపెట్టిన రూ.960 కోట్ల ధాన్యం డబ్బులు, రూ.384 కోట్ల విత్తన బకాయిలను చెల్లించామని వివరించారు.

* వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌: 50.37 లక్షల మంది రైతులకు లబ్ధి.  ఆగస్టులో విడుదల చేసిన రూ.977 కోట్లతో కలిపి రెండో విడతలో మొత్తం రూ.2,052 కోట్లు ప్రయోజనం.

* వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు: 6.67 లక్షల మంది ఖాతాల్లో రూ.112.7కోట్లు జమ.

* వైఎస్సార్‌ యంత్రసేవా పథకం: 1,720 రైతు బృందాలకు రూ.25.55 కోట్లు జమ.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో రైతులు వర్చువల్‌గా మాట్లాడారు
* నేను గిరిజన రైతును. మీరు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చిన వెంటనే మూడు దఫాలుగా రైతు భరోసా సాయం అందింది. కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నా. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి’.

- ఎం.విశ్వేశ్వరరావు, తడిగిరి, విశాఖ జిల్లా

* గతంలో జులైలో ఆకుమడులు వేసుకునేవాళ్లం. డబ్బుల్లేక ఆగస్టు నెలాఖరున ఆకుమడులు పోయడం వల్ల నష్టపోయాం. పంట పండించలేక పిల్లల్ని చదివించలేకపోయాం. ఇప్పుడు రైతుభరోసా వల్ల సకాలంలో పంటలు పండించుకోగల్గుతున్నాం.

- కొండే లాజరస్‌, పెదపాడు, పశ్చిమగోదావరి

* పదేళ్లుగా కౌలు రైతుగా జీవిస్తున్నా.  కౌలు రైతులకు కూడా మీరు రైతు భరోసా అందిస్తున్నారు. ఈ డబ్బును నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు కొనడానికి వాడుతున్నా’

- పులిపాటి పద్మ, పోట్లూరు, ప్రకాశం జిల్లా

* ‘గతంలో కర్నూలుకు వెళ్ళి ఎరువులు, విత్తనాలు ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వచ్చేది. ఇప్పుడు అవి గ్రామాల్లోనే  దొరుకుతున్నాయి.’

- శ్రీదేవమ్మ, లక్ష్మిదేవిపురం, కల్లూరు, కర్నూలు జిల్లా.


గురుకుల విద్యార్థులు ఐఐటీ సాధించడం గర్వకారణం: సీఎం

గురుకులాల్లో చదువుకొని జేఈఈ అడ్వాన్సుడ్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

అందజేసి, అభినందించిన సీఎం జగన్‌. చిత్రంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ

ముఖ్య కార్యదర్శి కె.సునీత, సంచాలకుడు రంజిత్‌ బాషా

గురుకులాల విద్యార్థులు కష్టపడి చదువుతున్నారని, భవిష్యత్తులోనూ ఈ దీక్ష కొనసాగిస్తే కచ్చితంగా ఐఏఎస్‌ సాధిస్తారని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాలు, కర్నూలులోని ఆదోని తదితర ప్రాంతాల విద్యార్థులు ఐఐటీ సాధించడం గర్వకారణమన్నారు. ఇలాగే కష్టపడితే తన పక్కనున్న స్థానాల్లో ఉంటారని వెల్లడించారు. జేఈఈ-అడ్వాన్సుడ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులను అభినందించి ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. ప్రభుత్వం తరఫున సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని విద్యార్థులకు సీఎం సూచించారు. ఐఏఎస్‌లలో చాలా మంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, ముత్యాలరాజు ఇందుకు ఉదాహరణ అని వివరించారు. గతంలో పాదయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల వెనకబాటుతనాన్ని చూశానని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆ ప్రాంతాల నుంచి ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లుగా వస్తే అక్కడి విద్యార్థుల్లో ఉన్నతవిద్య చదవాలన్న తపన పెరిగి సామాజికంగానూ పురోగతి చెందుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా ఆయన ప్రస్థానాన్ని వివరించాలని రేవు ముత్యాలరాజును సీఎం కోరారు. తన స్వగ్రామం కృష్ణా జిల్లా చినగొల్లపల్లిలో ఉన్న ఒక దీవికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదని, ఎందరో గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయని ముత్యాలరాజు గుర్తు చేసుకున్నారు. తన చెల్లెలు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. అప్పుడే సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకున్నానని, జాతీయస్థాయిలో తొలి ర్యాంకు  సాధించానని తెలిపారు. నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను పిలిచి ఏం కావాలని కోరగా, మా ఊరికి వంతెన నిర్మించాలని విన్నవించానన్నారు. ఆయన హామీతో మూడేళ్లలోనే వంతెన పూర్తయిందని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని