Covid Vaccine: బూస్టర్‌ తప్పనిసరి

ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్‌ డోసు (మూడోడోసు) వేసుకోవాలని హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌

Updated : 27 Nov 2021 04:43 IST

మూడో డోసు టీకాను వెంటనే ప్రారంభించాలి

అప్పుడే దేశంలో మూడోదశకు అడ్డుకట్ట 

‘ఈనాడు’ ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి 

అయితరాజు రంగారావు

ఈనాడు - హైదరాబాద్‌

ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్‌ డోసు (మూడోడోసు) వేసుకోవాలని హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రెండుడోసులు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తూనే.. బూస్టర్‌ డోసును ప్రారంభించాలని సూచించారు. అలా అయితేనే భారత్‌లో మూడోదశ ఉధ్ధృతిని నివారించవచ్చని తేల్చి చెప్పారు. మన దగ్గర ఇప్పటికీ డెల్టా కేసులే ఎక్కువగా వస్తున్నాయనీ, ఎక్కువగా జనాలు గుమిగూడిన సందర్భాల్లో వ్యాప్తి చెందిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. రెండు డోసుల టీకా పొందినా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దనీ, సత్వరమే పరీక్ష చేయించుకొని అవసరమైన చికిత్సను పొందాలని సూచించారు. ఐరోపా దేశాల్లో కేసులు మళ్లీ విజృంభించడం.. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తోన్న నేపథ్యంలో ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వివరించారు.

ఐరోపా దేశాల్లో కొవిడ్‌ విజృంభిస్తోంది.. మన దగ్గర మూడోదశ ఉధ్ధృతికి ఇది ప్రమాద ఘంటికా?

ఐరోపా దేశాల్లో చలి వాతావరణం ఉండడంతో వైరస్‌ వ్యాప్తి ఒక కారణం కాగా.. అక్కడ 30 శాతం మంది ప్రజలు టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. అందుకే ఆ పరిస్థితి నెలకొంది. భారత్‌లో రెండోదశ ఉద్ధృృతి సమయానికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కానీ ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అలా అని అతివిశ్వాసంతో ఉండకూడదు. కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చినా, దక్షిణాఫ్రికా వేరియంట్‌ వచ్చినా.. ఆ ప్రభావం మనపై ఉండకూడదనుకుంటే అందరూ తప్పనిసరిగా రెండుడోసులు వేసుకోవాలి. కొవిషీల్డ్‌ టీకా వ్యవధిని 84 రోజుల నుంచి తగ్గించాలి. కొవాగ్జిన్‌ గానీ, కొవిషీల్డ్‌ గానీ 28 రోజుల వ్యవధి చాలు. 6 నెలల వ్యవధి అనంతరం బూస్టర్‌ డోసు కూడా తీసుకోవాలి. మూడో డోసును ఇవ్వడం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చు.

బూస్టర్‌ డోసుపై శాస్త్రీయ అధ్యయనాలున్నాయా?

బూస్టర్‌ డోసుపై ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. అమెరికా, యూకే, ఫ్రెంచ్‌ ప్రభుత్వాలు కూడా బూస్టర్‌ డోసు తీసుకోవాలంటున్నాయి. చైనాలో ఇప్పటికే ఇస్తున్నారు. మూడోడోసు తీసుకున్న 6 నెలల తర్వాత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఇజ్రాయెల్‌ అధ్యయనం వెల్లడించింది. ప్రఖ్యాత వైద్య పత్రికలు ‘నేచర్‌’, ‘లాన్సెట్‌’లోనూ దీనిపై అధ్యయన పత్రాలను ప్రచురించారు. భారత్‌లోనూ ఐసీఎంఆర్‌ భువనేశ్వర్‌లో 600 మందిపై చేసిన ఒక అధ్యయనం వచ్చింది. రెండు డోసుల టీకా తీసుకున్న 6 నెలల తర్వాత యాంటీబాడీస్‌ తగ్గిపోతున్నట్లుగా ఈ అధ్యయనం పేర్కొంది.

* ఏఐజీలోనూ ఈ కోణంలో అధ్యయనం చేస్తున్నాం. దీని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. 500 మంది రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన వారిని.. 600 మంది ఒక్క డోసు కూడా టీకా తీసుకోకుండా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిని అధ్యయనం చేశాం.రెండు డోసులు పొందినవారిలోనూ 2 శాతం మంది తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. ఎందుకని లోతుగా విశ్లేషిస్తే.. వీరిలో యాంటీబాడీస్‌ స్థాయి చాలా స్వల్పంగా ఉంది. దీన్నిబట్టి బూస్టర్‌ డోసు అవసరమనేది స్పష్టమవుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా బూస్టర్‌ డోసును సిఫార్సు చేయలేదు కదా?

ప్రపంచంలోని అందరికీ రెండు డోసులు పూర్తయ్యే వరకూ ఇవ్వకూడదనే నియమంలో భాగంగానే బూస్టర్‌డోసుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మాట్లాడడం లేదు. అయితే అమెరికా, యూకే వంటి దేశాలు డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలను పాటించడం లేదు. తమ పౌరులకు ఏది లాభం చేకూరుతుందో అదే చేస్తున్నాయి. మనమూ వీలైనంత త్వరగా బూస్టర్‌ డోసు ప్రారంభించాలి.

ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి?

రెండోడోసు తీసుకున్న 6-9 నెలల మధ్యలో వేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఏ టీకాను బూస్టర్‌గా స్వీకరిస్తే మంచిది?

రెండు డోసులు ఏది స్వీకరించారో.. అదే తీసుకోవచ్చు. లేదా వేరేది కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా యాంటీబాడీస్‌ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఒకే రకమైన టీకాను మూడోడోసుగా తీసుకోవడం కంటే.. వేరే రకాన్ని బూస్టర్‌గా తీసుకుంటే ఇంకా మెరుగ్గా యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతున్నాయని మా అధ్యయనంలో గుర్తించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని