Budget 2022-23: ఈ విడత బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే.. అది ఉద్యోగాలే అయిఉండాలి

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘ఈసారి ఉద్యోగ కల్పనలో భారీ వృద్ధి అవసరం. ఈ విడత బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే...  

Updated : 27 Jan 2022 19:08 IST

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ డి.సుబ్బారావు

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘ఈసారి ఉద్యోగ కల్పనలో భారీ వృద్ధి అవసరం. ఈ బడ్జెట్‌కు ఏదైనా థీమ్ ఉంటే.. అది ఉద్యోగాలే అయిఉండాలి’ అని చెప్పారు. వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అసమానతలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఆయన ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని నిరంతరం పెంచాల్సిన అవసరం ఉన్నందున.. పన్ను తగ్గింపులకు పెద్దగా వెసులుబాటు ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే, ఎగుమతి రంగంలో సుంకాలు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది పన్ను వసూళ్లు బడ్జెట్ లక్ష్యం కంటే మెరుగ్గా ఉంటాయన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2022-23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

‘ప్రతి బడ్జెట్‌ లక్ష్యం.. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే. అయితే, ఈ విడత.. ఆర్థిక అసమానతలను తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని డా.సుబ్బారావు అన్నారు. ‘ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ 2022 నివేదిక’ను ఉటంకిస్తూ.. కరోనా పరిస్థితుల కారణంగా అల్పాదాయ వర్గాలు దెబ్బతిన్నాయని.. అదే సమయంలో సంపన్నులు భారీగా కూడబెట్టినట్లు గుర్తుచేశారు. ఈ అసమానతలు నైతిక విలువలకు విరుద్ధమని, పైగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను కూడా దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పాలనాపర సంస్కరణల ద్వారా సులభతర వ్యాపారం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) మెరుగుపరచడంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతులను పెంచాలని.. చెల్లింపుల్లో స్థిరత్వంతో పాటు ఉద్యోగాల కోణంలోనూ ఇది దోహదపడుతుందన్నారు. ఒమిక్రాన్‌ పరిస్థితుల ప్రభావం తక్కువగా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధిని సాధించగలమని, లేని పక్షంలో ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని