ఆరోగ్య బీమా మరింత భారం

కొవిడ్‌-19 ఎంతోమంది ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆసుపత్రుల బిల్లులు రూ.లక్షల మేర కావడంతో, తట్టుకునేందుకు చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈ రంగంలో గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి నమోదైంది.

Published : 22 May 2022 03:09 IST

సగటున 25%  వరకు పెరిగిన ప్రీమియం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 ఎంతోమంది ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆసుపత్రుల బిల్లులు రూ.లక్షల మేర కావడంతో, తట్టుకునేందుకు చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈ రంగంలో గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి నమోదైంది. కొవిడ్‌ తొలి దశ (2020), రెండో దశ (2021)లో తీసుకున్న చాలా ఆరోగ్యబీమా పాలసీలకు ఇప్పుడు పునరుద్ధరణ సమయం వచ్చింది. అయితే పెరిగిన ప్రీమియాలు పాలసీదార్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

వైద్య ద్రవ్యోల్బణం 30 శాతానికి పైగా పెరిగింది. కొవిడ్‌ తర్వాత ఎన్నో ఆసుపత్రులు చికిత్స ఖర్చులను అమాంతం పెంచేశాయి. రెండేళ్లుగా అత్యధిక క్లెయింలు రావడంతో, బీమా సంస్థలకు పరిహారం చెల్లింపుల భారం పెరిగింది. అందుకే బీమా సంస్థలు ప్రీమియాన్ని పెంచి, పాలసీదారులపై భారం మోపుతున్నాయి.

మధ్య వయసు నుంచీ పెంపు ఎక్కువ
ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, కంపెనీలు ప్రీమియాన్ని పెంచుతూ ఉంటాయి. 35 ఏళ్లలోపు వారికి బీమా ప్రీమియం పెద్దగా పెరగలేదు. కానీ, 36 ఏళ్లు దాటిన వారికి ప్రీమియంలో 10-15% భారమయ్యింది. 46 ఏళ్లు దాటిన వారికి బీమా ప్రీమియంలో 30% మేరకు పెంపు కనిపిస్తోంది. 50-55 ఏళ్ల వారికి బీమా సంస్థలు దీన్ని 50% పెంచుతున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు ఈ పెంపు 75% వరకు ఉందని ఒక బీమా సలహాదారుడు పేర్కొన్నారు.

కరోనా తరువాత ముందస్తు అనుమతి లేకుండానే, 5-10 శాతం వరకు ప్రీమియాన్ని పెంచుకునే వెసులుబాటును బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ  కల్పించింది.  దీన్ని బీమా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. వరుసగా ప్రీమియాలను సవరిస్తూ వెళ్తున్నాయి. ఇక నియంత్రణ సంస్థ అనుమతితో పెంచే మొత్తం దీనికి అదనంగా ఉంటోంది. ఇలా రెండేళ్లలో ప్రీమియం 25-40 శాతానికి పైగా పెరిగింది. ఒకసారి పాలసీ మొత్తం పూర్తయినా.. తిరిగి భర్తీ చేసే ‘రీస్టోర్‌’ తరహా పాలసీలకు అధిక మొత్తంలో  చెల్లించాల్సి వస్తోంది.

మరో సంస్థకు మారినా
ఇప్పుడు బీమా పాలసీ కొనసాగిస్తున్న సంస్థ ప్రీమియం అధికంగా వసూలు చేస్తుంటే తక్కువ ప్రీమియం ఉన్న సంస్థకు పాలసీని బదిలీ (పోర్టబిలిటీ) చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు తక్కువ ప్రీమియం ఉన్నా.. వచ్చే ఏడాది ఆ సంస్థా ప్రీమియం పెంచదనే హామీ ఉండదని బీమా నిపుణులు చెబుతున్నారు. పాలసీని ఎంచుకునేటప్పుడే.. బీమా సంస్థ క్లెయిం చెల్లింపుల చరిత్ర, గతంలో ప్రీమియాన్ని పెంచిన విధానం లాంటివి తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని