Budget 2022: ఈసారి డిజిటల్‌గానే బడ్జెట్‌.. పరిమితంగానే ప్రతుల ముద్రణ

కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌ ఈసారి కూడా కాగిత రహింతంగానే ఉండబోతోంది. డిజిటల్‌గానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Updated : 27 Jan 2022 19:20 IST

దిల్లీ: కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌ ఈసారి కూడా కాగిత రహింతంగానే ఉండబోతోంది. డిజిటల్‌గానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్‌ కాపీలను ముద్రించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో బడ్జెట్‌ అంటే పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతులను ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లోని ప్రింటింగ్‌ సిబ్బంది దాదాపు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో బయటి వ్యక్తులెవర్నీ వారు కలిసే వీలుండదు. హల్వా వేడుకతో ఈ క్వారంటైన్‌ ప్రారంభమయ్యేది.

అయితే, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ ప్రతుల ముద్రణను తగ్గించింది. పాత్రికేయులు, విశ్లేషకులకు పంపిణీ చేసే కాపీలను తగ్గించింది. గతేడాది కొవిడ్‌ మహమ్మారి విజృంభణ కారణంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కూడా ప్రతుల పంపిణీ నిలిపివేశారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఉద్దృతి నేపథ్యంలో హల్వా వేడుక కూడా నిర్వహించడం లేదు. అయితే, బడ్జెట్‌ డిజిటల్‌ డాక్యుమెంట్ల రూపకల్పన కోసం కొంతమంది సిబ్బంది మాత్రమే క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. పార్లమెంట్‌ సభ్యులు, సాధారణ ప్రజానీకం బడ్జెట్‌ డాక్యుమెంట్లను గతేడాది లాంచ్‌ చేసిన యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందొచ్చు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు, జనవరి 31న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. జనవరి 31న మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్‌గా జరిగే ఈ భేటీలో లోక్‌సభ/రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు పాల్గొంటారన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు