SBI Fixed Deposit: ఎస్‌బీఐలో ఎఫ్‌డీ చేశారా.. అయితే మీకు ఓ శుభవార్త!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా స్వల్పకాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది....

Updated : 17 Jan 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) కీలక  నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposits)పై వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్లు అంటే 0.1 శాతం పెంచింది.

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. కాలపరిమితి 1-2 ఏళ్ల మధ్య ఉన్న రూ.రెండు కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు (Interest Rate)ను 5 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. ఇవి నేటి (జనవరి 15, 2022) నుంచే అమల్లోకి రానున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే కేటగిరీలోని సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటును 5.5 శాతం నుంచి 5.6 శాతానికి పెంచారు.

వడ్డీరేట్ల పెంపు మొదలైందా?

గత ఏడాది డిసెంబరులోనే బేస్‌ రేటును ఎస్‌బీఐ 0.10 శాతం పెంచడంతో అది సంవత్సరానికి 7.55 శాతానికి చేరింది. డిసెంబరు 15, 2021 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తక్కువ వడ్డీరేట్లకు ఇక సమయం ముగిసిందనడానికి ఇది సంకేతం అని బ్యాంకింగ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోన్లు ఇచ్చేందుకు బేస్‌ రేట్‌ను ఆధారంగా తీసుకుంటారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్ల ట్రెండ్‌ను కూడా ఇది సూచిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బేస్‌ రేటు పెరగడంతో త్వరలో మరిన్ని వడ్డీరేట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరాయి. దీంతో ఈ కేటగిరీలో ఇన్వెస్ట్‌ చేసినవారు చాలా తక్కువ రాబడి పొందుతున్నారు. అలాంటి వారికి తాజా వడ్డీరేట్ల పెంపు శుభవార్తనే చెప్పాలి!

ఇదే బాటలో హెచ్‌డీఎఫ్‌సీ...

కొన్ని నిర్ణీత కాలావధి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇటీవలే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) సైతం వడ్డీరేట్లు పెంచింది. ఇవి జనవరి 12, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో 2-3 ఏళ్ల కాలపరిమితి కలిగిన రూ.రెండు కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేటు 5.2 శాతానికి, 3-5 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.4 శాతానికి, 5-10 ఏళ్ల గడువు కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటు 5.6 శాతానికి పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని