Bengaluru: వ్యక్తిని హత్య చేసి.. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి..!

కర్ణాటక రాజధాని బెంగళూరులో నలుగురు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి......

Published : 18 Oct 2021 01:37 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నలుగురు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు భాస్కర్‌ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఓ వివాహిత సైతం అదే షాప్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సదరు మహిళ 15 రోజుల క్రితం పిల్లలతో కలిసి అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో భాస్కర్‌ శనివారం సాయంత్రం సదరు మహిళ ఇంటికి వెళ్లి ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకువెళ్లేందుకు యత్నించాడు. పెద్ద కుమారుడు ససేమిరా అనడంతో ప్రియురాలితోపాటు ఆమె చిన్న కుమారుడిని తీసుకెళ్లాడు. అయితే పెద్ద కుమారుడు ఈ విషయాన్ని తన మేనమామ మునిరాజుకు తెలియజేశాడు. దీంతో మునిరాజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి భాస్కర్‌ వెళుతున్న ఆటోరిక్షాను అడ్డుకున్నారు. తన సోదరి, అల్లుడిని అక్కడే దించేసి.. భాస్కర్‌ను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారంతా కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. భయాందోళనకు గురైన మునిరాజు విషయాన్ని తన తల్లికి తెలియజేశాడు. ఆమె సలహా మేరకు మృతదేహాన్ని నేరుగా పోలీసుస్టేషన్‌కు తరలించిన నిందితులు పోలీసు వద్ద లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని