ఇల్లరికం వస్తానన్నాడు.. ఇల్లొదిలి వెళ్లాడు!

అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి తరఫు వారు ఆ విషయంపైనా చర్చించారు. యువకుడు అందుకూ అంగీకరించడంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా రేపు పెళ్లనగా, ఒకరోజు ముందు అతను అదృశ్యం కావడంతో అందరూ అవాక్కయ్యారు.

Updated : 30 Jan 2020 07:30 IST

  పెళ్లికి ఒక్కరోజు ముందు.. యువకుడు పరార్‌
  ఆగిన వివాహం, పోలీసులకు ఫిర్యాదు

ముథోల్‌, న్యూస్‌టుడే: అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి తరఫు వారు ఆ విషయంపైనా చర్చించారు. యువకుడు అందుకూ అంగీకరించడంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా రేపు పెళ్లనగా, ఒకరోజు ముందు అతను అదృశ్యం కావడంతో అందరూ అవాక్కయ్యారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో బుధవారం జరిగిన ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో, ముథోల్‌ గ్రామానికి చెందిన సంతోష్‌కు నెల రోజుల కిందట వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలోనే ఇల్లరికం వెళ్లేందుకూ అతను అంగీకారం తెలిపాడు. బుధవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం సాయంత్రమే యువతి సహా ఆమె కుటుంబ సభ్యులు ముథోల్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి యువకుడు అదృశ్యం కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికారు. బుధవారం సాయంత్రం వరకు అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఉద్దేశ పూర్వకంగానే అతను పరారయ్యాడనే నిర్ధారణకు వచ్చిన యువతి తరఫు వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనికి వివాహం ఇష్టం లేదా? ఇల్లరికం వెళ్లడం ఇష్టం లేక పరారయ్యాడా? అనేది తెలియాల్సి ఉందని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని