
వరుడే బావమరిదిని చంపేశాడు
ఫరూఖాబాద్: ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఓ వివాహ విందులో విషాదం చోటుచేసుకుంది. వివాహ విందు గురించి ఆగ్రహించిన వరుడు.. సొంత బావమరిదినే చంపేశాడు. అంతేకాకుండా తన వాహనంతో బంధువులపైకి దూసుకెళ్లి ముగ్గురుని గాయపరిచాడు. పోలీసులు ఉత్తర్ప్రదేశ్లోని ఫరుఖాబాద్కి చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. ఈ వివాహ విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుడు, అతని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. దీంతో ఘర్షణ పెద్దది కాకుండా ఇతర బంధువులు జోక్యం చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వరుడు, అతని స్నేహితులు తన మామయ్యపై కాల్పులు జరిపినట్లు వధువు సోదరుడు పునీత్ తెలిపాడు. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నాడు. అనంతరం అక్కడే నీళ్లు అందిస్తున్న తన సోదరుడు ప్రన్షు (9)ను వరుడు, అతని స్నేహితులు తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారని ఆయన తెలిపాడు. ఈ క్రమంలో వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టినట్లు తెలిపాడు. అనంతరం కారులో పారిపోయినట్లు పునీత్ పేర్కొన్నాడు. తిరిగి రావాలని వరుడు మనోజ్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను వెనక్కి రాలేదని, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రన్షు మృతదేహాన్ని గ్రామంలో వదిలివెళ్లారని ఆయన వెల్లడించారు. దీంతో వధువు తండ్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రన్షు మెడపై గొంతు నులిమిన గుర్తులున్నాయని వధువు కుటుంబ సభ్యులు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.