AP News: మృతువుతో పోరాడి మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కన్నుమూత

విశాఖలో ఈ నెల 13న ఉన్మాదిగా మారిన యువకుడు చేసిన పెట్రోలు దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ప్రేమను

Updated : 20 Nov 2021 08:11 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో ఈ నెల 13న ఉన్మాదిగా మారిన యువకుడు చేసిన పెట్రోలు దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో తెలంగాణలోని భూపాల్‌పల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌రెడ్డి యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించడం ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అనంతరం తానూ పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్న హర్షవర్ధన్‌ ఈ నెల 16న మరణించాడు. చిన్నతనం నుంచి చదువులో రాణించిన యువతికి పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో భారీ రాయితీతో సీటు రావడంతో అక్కడికి వెళ్లి చదువుకుని కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. ఆ సమయంలో పరిచయమైన తోటివిద్యార్థి హర్షవర్ధన్‌తో స్నేహం చేయడం ఆమెకు శాపంగా మారింది. ఇంజినీరింగ్‌ అనంతరం ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న ఆమె కోసం హర్షవర్ధన్‌ విశాఖ వచ్చారు. తాను బస చేసిన హోటల్‌కు నమ్మకంగా పిలిచి... తన ప్రేమ విషయం మాట్లాడి, ఆమె కాదనడంతో పెట్రోలు పోసి నిప్పంటించినట్లు పోలీసు దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కాలిన గాయాల కారణంగా శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిని యువతి మృతి చెందినట్లు దిశ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ ‘ఈనాడు’కు తెలిపారు. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని