పగ ఒకరిది... పావులు మరికొందరు

అతడో పాత నేరస్థుడు. ఇప్పటికీ కొన్ని కేసులు నడుస్తున్నాయి. కుటుంబం కోసం నేరాలు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు. అతడి కుమారుడికి అనారోగ్యం సోకడంతో డబ్బు అవసరమైంది. ఈ విషయాన్ని మరో పాత నేరస్థుడు గుర్తించాడు.

Published : 22 May 2022 06:37 IST

డబ్బు ఎర చూపి.. హంతకులుగా మార్చి..
సుపారీకి ఆశపడి  నిరుపేదలు జైలుపాలు
కిరాయి హత్యల నేపథ్యం ఇదే

ఈనాడు హైదరాబాద్‌

* అతడో పాత నేరస్థుడు. ఇప్పటికీ కొన్ని కేసులు నడుస్తున్నాయి. కుటుంబం కోసం నేరాలు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు. అతడి కుమారుడికి అనారోగ్యం సోకడంతో డబ్బు అవసరమైంది. ఈ విషయాన్ని మరో పాత నేరస్థుడు గుర్తించాడు. ఆ డబ్బును ఎరగా చూపి.. అతడిని ఓ హత్యానేరంలో భాగస్వామిగా చేశాడు.

* మరో కేసులో సూత్రధారులు... ఇల్లు గడవని స్థితిలో ఉన్న ఒక నిరుపేదకు డబ్బు ఆశ పెట్టి, అతడితో హత్య చేయించారు. ఇదే నేరంలో పాల్గొన్న మరో కుటుంబ సభ్యులు కొద్దిపాటి సొమ్ముకు ఆశపడి ఈ రొంపిలో దిగారు.
పగ, ప్రతీకారం ఒకరివి.. వారు వేసే డబ్బు ఎరకు చిక్కి.. జీవితాలను ఛిద్రం చేసుకునే వారు వేరొకరు. తమ పేరు బయటకు రాకుండా వ్యవహారం చక్కబెట్టాలని.. ప్రధాన నిందితులు సుపారీ ఇచ్చి కిరాయి మనుషులతో హత్యలు చేయిస్తున్నారు. కొద్దిపాటి డబ్బిస్తే తెగించే సామాన్యులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. వీరిచ్చే డబ్బు కుటుంబ అవసరాలకో, విలాసాలకో పనికొస్తుందన్న ఆశతో హత్యలకు పాల్పడేవారు చివరకు కటకటాలపాలవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కిరాయి హత్యల నేపథ్య సారాంశమిదే. డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యే హంతకులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

చిన్న నేరస్థుడు హంతకుడిగా మారి..

కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు తన అల్లుడు ప్రణయ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నాడు. నల్గొండ జిల్లాలో పాత నేరస్థుడైన అబ్దుల్‌బారీని సంప్రదించాడు. కోటి రూపాయలకు ఒప్పందం కుదిరింది. అబ్దుల్‌బారీ తనలాంటి నేపథ్యమే ఉన్న అస్గర్‌అలీతోపాటు బిహార్‌కు చెందిన సుభాష్‌శర్మను రంగంలోకి దింపాడు.  ప్రణయ్‌ని హత్య చేసే క్రమంలో శర్మ రెండుమూడుసార్లు ప్రయత్నించి భయంతో వెనక్కి తగ్గాడు. చివరకు సూత్రధారులు గట్టిగా ఒత్తిడి చేయడంతో హతమార్చాడు.

రోడ్డున పడిన వ్యక్తితో రూ. 10 లక్షల బేరం

ఆ మధ్య భువనగిరికి చెందిన రామకృష్ణ హత్యోదంతంలో ప్రధాన సూత్రధారులు.. ఓ నిరుపేదకు రూ. 10 లక్షల ఆశచూపి రంగంలోకి దింపారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న రామకృష్ణ హత్యకు మామ వెంకటేశ్‌ పథకం వేశాడు. తన మిత్రుడైన యాదగిరి ద్వారా లతీఫ్‌తో రూ.పది లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. లతీఫ్‌ తన భార్య దివ్య ద్వారా ధనలక్ష్మిని, ఆమె ఇద్దరు కుమారుల్ని రంగంలోకి దింపాడు. మోత్కూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన లతీఫ్‌.. తన టీ దుకాణం రోడ్డు విస్తరణలో పోవడంతో బతుకుతెరువు కోల్పోయాడు. ధనలక్ష్మి.. వేములవాడ దేవాలయం వద్ద తాయెత్తులు అమ్ముతూ జీవించేది. తనతోపాటు తన కుమారులిద్దరికీ రూ.30 వేల చొప్పున ఇస్తామంటే సరే అంది. హత్య తామే చేస్తామని, శవాన్ని తీసుకొచ్చేందుకు సహకరిస్తే చాలని ముందుగానే లతీఫ్‌ ఆమెతో చెప్పినట్లు సమాచారం.

* ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు మట్టారెడ్డి ఇంటి జాగా ఇస్తాననడంతో శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిలను హత్య  చేసేందుకు ఖాజా మొయినుద్దీన్‌, బొర్రా భిక్షపతి అంగీకరించారు.  

* బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఫర్హాన్‌ హత్యకేసులో ప్రధాన సూత్రధారి షేక్‌ ఉస్మాన్‌.. విలాసాలకు అలవాటుపడ్డ నలుగురు యువకులతో రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్థిరాస్తి వ్యాపారం కోసం తీసుకున్న రూ.9 లక్షలు తిరిగి ఇవ్వకపోగా చంపుతానని బెదిరించిన ఫర్హాన్‌ను హతమార్చేందుకు ఉస్మాన్‌ ఈ కుట్ర చేశాడు. ఇందుకోసం మహ్మద్‌ అజార్‌, మహ్మద్‌ రషీద్‌, మహ్మద్‌ అక్రం, పర్వేజ్‌ అనే యువకులను ఎంచుకున్నాడు.

పట్టుబడడం ఖాయం!

దాదాపు ప్రతి హత్యలోనూ నిందితులు దొరికిపోతారు. వారు మాట్లాడుకున్న సుపారీ డబ్బు దక్కడం అటుంచి కటకటాల పాలవడం ఖాయం. ఉదాహరణకు ప్రణయ్‌ను హత్య చేసిన సుభాష్‌శర్మకు అబ్దుల్‌బారీ రూ.5 లక్షల ఆశచూపి.. అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చాడు. హత్య జరిగిన తర్వాత బిహార్‌లోని శర్మ స్వగ్రామం సంస్థీపూర్‌కు పారిపోయేందుకు మరో రూ.20 వేలు ఇచ్చాడు. కానీ అతడు ఆ గ్రామానికి చేరుకునేలోపే విమానంలో పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇల్లు చేరగానే శర్మను అరెస్టు చేశారు. అతడు రెండేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. రామకృష్ణ హత్య కేసులో ధనలక్ష్మి, ఆమె కుమారులకు రూ.30 వేల చొప్పున మాట్లాడుకొని తలా రూ.20 వేలు అడ్వాన్సుగా ఇచ్చారు. మిగతా రూ.10 వేలు తీసుకునే లోపే వారంతా జైలుపాలయ్యారు.

భవిష్యత్తంతా దుర్భరమే

హత్య కేసులో ఇరుక్కుంటే జీవితమంతా దుర్భరమే. పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగలేక నరకం చూడాల్సిందే. హంతకులుగా ముద్రపడిన వారికి ఎవరూ ఇళ్లు అద్దెకు ఇవ్వరు. వారి పిల్లల్ని జనం చులకనగా చూస్తారు. పాఠశాలల్లో చదివించుకోవడమూ కష్టమే.  ఆ పిల్లలతో స్నేహం చేసేందుకూ ఎవరూ ముందుకు రారు. అవసరం ఆర్థికంగా ఎంత పెద్దదైనా, నేరాలతో తీర్చుకుందామంటే జీవితం తలకిందులవుతుంది.    కుటుంబసభ్యులే కాకుండా వారి ముందు తరాలనూ అంధకారంలోకి నెట్టినట్లవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని