GST: రూ.1000 కోట్లకు నకిలీ బిల్లులు.. అకౌంటెంట్‌ అరెస్టు!

నకిలీ బిల్లులు సృష్టించి భారీ మోసానికి పాల్పడిన ఓ అక్రమార్కుడిని అరెస్టు చేసినట్టు మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు వెల్లడించారు.......

Published : 27 Jan 2022 01:29 IST

ముంబయి: నకిలీ బిల్లులు సృష్టించి భారీ మోసానికి పాల్పడిన ఓ అక్రమార్కుడిని అరెస్టు చేసినట్టు మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు వెల్లడించారు. 27 ఏళ్ల వయసు కలిగిన అకౌంటెంట్‌ రూ.1000 కోట్లకు పైగా బోగస్‌ బిల్లులు జారీ చేసినట్టు గుర్తించామన్నారు. అలాగే, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)లో రూ.181 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడని జీఎస్టీ అధికారులు తెలిపారు. నిందితుడుని ముంబయి జోన్‌ పరిధిలోని సీజీఎస్టీ పాల్ఘర్‌ కమిషనరేట్‌ అధికారులు అరెస్టు చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. 12వ తరగతి వరకు చదువుకున్న నిందితుడు అకౌంటెంట్‌గా, జీఎస్టీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. 

M/s నిథిలన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ వస్తువులు లేదా సేవలకు సంబంధించి రసీదులు లేకుండా బోగస్‌ బిల్లులను సృష్టించినట్టు గుర్తించిన అధికారులు.. ఆ సమాచారాన్ని విశ్లేషించి దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నిందితుడు తన పేరు బయటపడకుండా తన క్లయింట్‌లలో వేరొకరి గుర్తింపుతో జీఎస్టీ మోసాలకు పాల్పడినట్టు తేల్చారు. దీనిపై తగిన సాక్ష్యాధారాలను సేకరించి అతడిని అరెస్టు చేయగా.. దాదాపు రూ.1000 కోట్లకు పైగా బోగస్‌ బిల్లులు జారీ చేయడంతో పాటు రూ.181 కోట్ల మోసానికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీ విధించిందన్నారు. మరోవైపు, ఇదో పెద్ద నెట్‌వర్క్‌ అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్‌ వెనుక కీలక వ్యక్తి ఎవరు? లబ్ధిదారులు ఎవరెవరనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని