TS News: గంటన్నరలో ఏడు దొంగతనాలు

గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలకు పాల్పడిన కరుడుగట్టిన స్నాచర్‌ను

Updated : 20 Jul 2021 10:11 IST

కరుడుగట్టిన గొలుసుదొంగ అరెస్టు

నారాయణగూడ, న్యూస్‌టుడే: గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలకు పాల్పడిన కరుడుగట్టిన స్నాచర్‌ను మలక్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ చేసే సొత్తును ఏడు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌ ఎం.రమేశ్, అదనపు డీసీపీ కె.మురళీధర్, మలక్‌పేట్‌ ఏసీపీ ఎన్‌.వెంకటరమణలతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఎల్‌బీనగర్, ఎన్టీఆర్‌ నగర్, ఫేస్‌-3 ఓ పత్రికలో వార్తా పంపిణీ విభాగంలో సహాయ మేనేజర్‌గా పని చేస్తున్న గంగపురం నరేందర్‌ ఈనెల 14న మలక్‌పేట్‌ వెళ్లారు. అక్కడ తన విధులు ముగించుకొని కాలినడకన ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రభుత్వ గర్ల్స్‌ జూనియర్‌ కళాశాలకు చేరుకున్నారు. సుమారు ఉదయం 7.20 నిమిషాలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి నరేందర్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని ఆస్మాన్‌ఘడ్‌ ప్రాంతం వైపు వెళ్లిపోయాడు. బాధితుడు మలక్‌పేట్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదేరోజు గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు డబీర్‌పుర షా కాలనీలో ఉండే ముదస్సిర్‌ అలియాస్‌ బిపాషా (21)గా పోలీసులు గుర్తించారు. ఇతను బాల్యంలోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. కాచిగూడ రైల్వే పోలీసులకు దొరికిపోయాడు. రోడ్లపై సందుల్లో వెళుతూ.. ఒంటరిగా కనిపించే అమాయక ప్రజలను బెదిరించి సెల్‌ఫోన్లు, డబ్బులు లాక్కొనిపోతుంటాడు. ఆ తర్వాత రెయిన్‌ బజార్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విడుదలైన బిపాషా.. మళ్లీ ప్రణాళికను రచించాడు. తన ప్రణాళిక ప్రకారం 13న ఓ వ్యక్తిని బెదిరించి ద్విచక్రవాహనం తీసుకొని వెళ్లిపోయాడు. 14న రెయిన్‌బజార్, కాచిగూడ, సైదాబాద్, సరూర్‌నగర్, మాదన్నపేట్, మలక్‌పేట్‌ల్లో 7 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లాడని పోలీసులు గుర్తించారు. మలక్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, డీఐ డి.నానునాయక్‌ ఆధ్వర్యంలో ఎస్సై సైదులు తమ సిబ్బందితో కేసును పరిష్కరించారు. కమిషనర్‌ వీరిని అభినందించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని