logo

Crime News: శిల్పాచౌదరి కేసులో ఎవరా ఇద్దరు?

గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన శిల్పాచౌదరి దంపతుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటిరోజు విచారణలో చూపిన అమాయకత్వమే

Updated : 05 Dec 2021 10:14 IST

నివాసంలో కీలకపత్రాలు స్వాధీనం

బ్యాంకు ఖాతాల పరిశీలన

ముగిసిన పోలీసు కస్టడీ

ఈనాడు, హైదరాబాద్‌; నార్సింగి, న్యూస్‌టుడే: గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన శిల్పాచౌదరి దంపతుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటిరోజు విచారణలో చూపిన అమాయకత్వమే శిల్పాచౌదరి రెండోరోజు ప్రదర్శించింది. పోలీసుల ప్రశ్నలతో భావోద్వేగానికి గురై పలుమార్లు కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. ఈ దంపతులపై నార్సింగి ఠాణాలో 7 కేసులు నమోదయ్యాయి. రూ.12 కోట్లు మోసపోయినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆమె మాటల్లో నిజమెంత..

శిల్పాచౌదరి రెండ్రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. శుక్ర, శనివారాలు నార్సింగిలోని ఎస్‌వోటీ(స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌) కార్యాలయంలో విచారించారు. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే రూ.కోట్లు అప్పులు చేశానని, ఊహించని విధంగా పోలీసులు అరెస్ట్‌ చేయటంతో బుర్రంతా మొద్దుబారిందంటూ మౌనంగా ఉన్నట్టు సమాచారం. ఎవర్నీ మోసం చేయాలనే ఆలోచన లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. ఆధారాలను ముందు పెట్టడంతో క్రమంగా తాను తీసుకున్న డబ్బును ఆసుపత్రి నిర్మాణానికి ఖర్చు చేశానని చెప్పుకొచ్చారు. ఇద్దరికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చినట్టు విచారణలో కొత్త పేర్లు తెరమీదకు తెచ్చారు. వారిలో ఒకరు శంకరంపల్లికి చెందిన రాధిక అని ఆమెకు రూ.6 కోట్లు ఇచ్చానంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గండిపేటలోని శిల్ప ఇంట్లో శనివారం పోలీసులు సోదాలు చేసి బ్యాంకు ఖాతా పుస్తకాలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ప్రైవేటు బ్యాంకులో ఖాతాలను పరిశీలించారు. నాలుగు బ్యాంకు ఖాతాల్లో రెండింట్లో ఎటువంటి నగదు లేదని గుర్తించారు. మరో రెండు ఖాతాలను ఫ్రీజ్‌ చేయించారు. రాధిక శనివారం మాదాపూర్‌ ఏసీపీని కలసి తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని కేవలం ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. 

ఆ ఇద్దరికీ నోటీసులు జారీ 

ఆమె వెల్లడించిన ఇద్దరికీ సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ ఇద్దరూ వ్యాపార భాగస్వాములా! నిజంగానే డబ్బు తీసుకున్నారా! అనే వివరాలు దర్యాప్తులో బయటపడతాయని అభిప్రాయ పడుతున్నారు. రెండ్రోజుల కస్టడీలో ఆమె నుంచి పోలీసులు పూర్తివివరాలు రాబట్ట లేకపోయారు. వివరాలు రాబట్టేందుకు మరోసారి ఆమెను కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని