logo

నిఘా నీడన గుడులు... బడులు

విద్యా మందిరాలు, ప్రార్థనా మందిరాల ఆవరణలను సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు రెండు, మూడు నెలల క్రితం సర్వే నిర్వహించారు. సుమారు 25 వేల సీసీ కెమెరాలను అమర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

Published : 06 Dec 2021 03:11 IST
స్వీయ రక్షణ... ముందస్తు భద్రతకు పోలీసుల కార్యాచరణ
సికింద్రాబాద్‌లోని వెంకటేశ్వర పెరుమాళ్‌ దేవాలయంలో సీసీ కెమెరా

ఈనాడు, హైదరాబాద్‌: విద్యా మందిరాలు, ప్రార్థనా మందిరాల ఆవరణలను సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు రెండు, మూడు నెలల క్రితం సర్వే నిర్వహించారు. సుమారు 25 వేల సీసీ కెమెరాలను అమర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల్లో సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణతోపాటు, ఘటనా స్థలాల్లోనే నేరస్థులను పట్టుకుంటున్నారని, ఇదే తరహాలో స్వీయ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ పోలీస్‌ అధికారులు వివరిస్తున్నారు.  

 

మహబూబియా కళాశాలలో..

అవగాహన.. భాగస్వామ్యం

పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్ద రాత్రిళ్లు జన సంచారం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాఠశాలల్లో కంప్యూటర్లను, ఆలయాల్లో హుండీ ఆదాయాన్ని పట్టుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయన్న అంశాలపై ఆలయాల కమిటీ సభ్యులకు, పాఠశాలల కమిటీలకు పోలీసులకు అవగాహన కల్పించనున్నారు. వారి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌ ఠాణా పరిధిలో కనీసం 2-3 వేల కెమెరాలను ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటు చేయించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మూడు నెలల నుంచి సికింద్రాబాద్‌ పరిధిలో ఎక్కువగా ఏర్పాటు చేశారని గుర్తించారు. వారితో మాట్లాడి ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరనున్నారు.


ఠాణాలతో అనుసంధానం

​​​​​​​

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రతి పోలీస్‌ ఠాణాను పోలీసులు జియో ట్యాగింగ్‌(ప్రాంతమంతా రేఖాంశాలు, అక్షాంశాలతో గుర్తించే విధానం) చేశారు. ప్రస్తుతమున్న సీసీ కెమెరాలను దీనికి అనుసంధానించారు. భవిష్యత్తులో ఏదైనా నేరం జరిగినా లేదా ఆయా ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ కావాలన్నా, పోలీసుల సహకారం అవసరమైనా వేగంగా స్పందించేందుకు వీలుంటుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయం నుంచి అర కి.మీ. దూరం వరకూ ప్రధాన ప్రాంతాలు, గల్లీల్లోని నిఘా వ్యవస్థను స్థానిక పోలీస్‌ ఠాణాకు అనుసంధానించారు. ఆ ప్రాంతంలో ఏదైనా అనూహ్య ఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. తద్వారా కెమెరాల పనితీరును ఠాణా నుంచే పర్యవేక్షించడమే కాకుండా లోపాలుంటే సవరించుకునేందుకు అవకాశం ఉంటుందని పోలీస్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని