logo

ప్రాణాలు పోతున్నా శిక్షల్లేవ్‌

మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులకు చట్టపరంగా శిక్షలు పడడం లేదు. గర్భశోకంతో బాధితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నా, కుటుంబ సభ్యులను కోల్పోయి

Published : 07 Dec 2021 02:38 IST

ఐదున్నరేళ్లైనా మొదలుకాని రమ్య మృతి కేసు విచారణ

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, విద్యానగర్‌: మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులకు చట్టపరంగా శిక్షలు పడడం లేదు. గర్భశోకంతో బాధితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నా, కుటుంబ సభ్యులను కోల్పోయి కట్టుబట్టలతో మిగులుతున్నా.. వారికి న్యాయం జరగడం లేదు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి జైళ్లకు పంపుతున్నారు. వారు కొద్దిరోజులు జైల్లో ఉండి బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. నగరంలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1400 మంది మృతి చెందారు. సుమారు 800మంది మందుబాబులు ఢీకొట్టడం వల్లే చనిపోయారు.

వైరస్‌ వల్ల జాప్యమట..
డీడీ కాలనీలో తల్లిదండ్రులతో నివాసముంటున్న తొమ్మిదేళ్ల బాలిక రమ్య రోడ్డు ప్రమాదంలో జులై 1, 2016న మృతి చెందింది. రమ్య సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు కారులో ఆమె బాబాయిలు, తాత వెళ్లారు. ఇంటికి వస్తున్నప్పుడు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2/3 నుంచి పంజాగుట్టవైపు వేగంగా వస్తున్న కారు విభాగినిని ఢీకొని రమ్య ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఒక బాబాయి అక్కడికక్కడే చనిపోగా.. వారం రోజులు కోమాలో ఉన్న రమ్య తర్వాత చనిపోయింది. ప్రమాదం జరిగిన 18రోజులకు రమ్య తాత చనిపోయాడు. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. ప్రధాన నిందితుడు శ్రావిల్‌కు బెయిల్‌ వచ్చింది. కేసు విచారణ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని బంజారాహిల్స్‌ పోలీసులను ప్రశ్నించగా కరోనా వైరస్‌ ప్రభావంతో కొన్ని నెలలు జాప్యం జరిగిందని. వచ్చేనెలలో విచారణ ప్రారంభమవుతుందని వివరించారు.

అభియోగాలే ఆటంకాలా?.
మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులు చనిపోతే ఐపీసీ 304 పార్ట్‌-2, ఐపీసీ 337, 185 సెక్షన్లను నమోదు చేస్తున్నారు. కారు పైనుంచి పోనిచ్చినా, ఢీకొట్టినా, బైక్‌తో బలంగా ఢీకొట్టిప్పుడు బాధితులు చనిపోతే అది మద్యంమత్తులో వాహనదారులు చేసిన హత్యేనని బాధితులు అంటున్నారు. కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించేందుకు, ఫోరెన్సిక్‌ విభాగం నుంచి ఫలితాలు వచ్చేందుకు ఆలస్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు. మత్తులో నడిపి ప్రాణాలు తీస్తున్న వారిని శిక్షించాలంటే ఐపీసీ సెక్షన్లను మార్చాలంటూ బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

ఇంకెంత కాలం: పి.వెంకటరమణ, రమ్య తండ్రి
మద్యం మత్తులో నా కుమార్తె మరణానికి కారణమైన వ్యక్తికి శిక్ష ఎప్పుడు వేస్తారు? ముగ్గురి మరణానికి కారణమైన పబ్‌ను ఏడాది తిరిగేసరికి ఎక్సైజ్‌శాఖ ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటికీ నా భార్య, తమ్ముడు అనారోగ్య సమస్యలతోనే బాధపడుతున్నారు. ఎన్నో కేసుల్ని పరిష్కరిస్తామంటున్న పోలీసులు రమ్య కేసును ఎందుకు పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని