ఏం జరుగుతోంది?.. మళ్లీ మాయమైన ఏకశిల

ఏకశిలల రహస్యం రిశోధకులకు ప్రశ్నలు సంధిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందో.. మళ్లీ ఎప్పుడు మాయమైపోతుందో అంతుచిక్కడం లేదు....

Published : 03 Dec 2020 00:57 IST

గ్రహాంతరవాసుల పనేనని పలువురి అనుమానం

బుచారెస్ట్‌: ఏకశిలల రహస్యం పరిశోధకులకు ప్రశ్నలు సంధిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందో.. మళ్లీ ఎప్పుడు మాయమైపోతుందో అంతుచిక్కడం లేదు. మొదట అమెరికాలోని ఓ ఎడారిలో కనిపించిన ఏకశిల అనంతరం అక్కడినుంచి మాయమైంది. రోజు గడవకముందే అదే తరహా స్తంభం రొమానియాలో దర్శనమిచ్చింది. మళ్లీ కొద్దిరోజులు గడవకముందే అక్కడి నుంచి మాయమైంది. కాగా ఈ పని ఎవరు ఎందుకు చేస్తున్నారో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు.

నవంబర్‌ 18న అమెరికాలోని యుటాలో ఉన్న రెడ్‌కార్‌ ఎడారిలో వన్యప్రాణి విభాగ సిబ్బంది ఓ ఏకశిలను గుర్తించారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేసినట్లు ఉన్న ఆ నిర్మాణం త్రిభుజాకారంలో మెరుస్తూ కనిపించింది. జనసంచారంలేని ఆ ప్రాంతంలో దాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అర్థం కావడం లేదు. అయితే ఆ శిల అకస్మాత్తుగా మాయమైంది. అది అదృశ్యమై 24 గంటలు గడవకముందే యూరోప్‌లోని రొమానియాలో అదే తరహా శిలను కొందరు గుర్తించారు. పెట్రోడోవా డేసియన్‌ కోట లాంటి ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రాంతంలో ఓ శిల పాతిపెట్టి ఉండటాన్ని గుర్తించి అధికారులకు తెలిపారు. ఆ స్తంభంపై అర్థం కాని రాతలు కూడా కనిపించాయి. అది కనగొనబడిన ప్రదేశంలో ఏ పనిచేయాలన్నా అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ అధికారులకు తెలియకుండానే ఆ శిలను ఎవరో పాతిపెట్టడం గమనార్హం.

అయితే కొద్దిరోజులు గడవకముందే ఆ శిల కూడా కనిపించకుండా పోయింది. ఎవరో దాన్ని తవ్వి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆ వింత శిలను చూసేందుకు వెళ్లిన స్థానికులకు అక్కడ ఎలాంటి నిర్మాణం కనిపించలేదు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఇది గ్రహాంతరవాసుల పనేనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని