‘చంద్రయాన్‌-2’కి ఏడాది

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఏడాదిని పూర్తి చేసుకుంది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ విఫలమైనప్పటికీ.. చందమామ చుట్టూ ఆర్బిటర్‌ విజయవంతంగా పరిభ్రమిస్తోంది. దా

Published : 22 Aug 2020 01:36 IST

బెంగళూరు : భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఏడాదిని పూర్తి చేసుకుంది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ విఫలమైననప్పటికీ.. చందమామ చుట్టూ ఆర్బిటర్‌ విజయవంతంగా పరిభ్రమిస్తోంది. దానిలో సరిపడా ఇంధనం ఉందని.. మరో ఏడేళ్లు సేవలు అందించడానికి ఇది సరిపోతుందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్‌-2 ప్రాజెక్టును భారత్‌ గత ఏడాది జులై 22న చేపట్టింది. ఇది చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 20న ప్రవేశించింది. ‘చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చివరి క్షణాల్లో విఫలమైంది. ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. ఇప్పటి వరకూ చందమామ చుట్టూ ఇది 4,400కుపైగా ప్రదక్షిణలు చేసింది.. అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నాయి’ అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ని మోసుకెళుతూ జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 ఎం1 రాకెట్‌ 2019, జులై 22న నింగిలోకి దూసుకెళ్లింది. 45 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబరు 6-7 మధ్య రాత్రి ల్యాండింగ్‌కు సిద్ధమైంది. కానీ, సాంకేతిక కారణాలతో ల్యాండర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది లూనార్‌ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టింది. దీంతో ల్యాండర్‌లోని భాగాలు దెబ్బతిని భూకేంద్రంతో సంబంధాలు కోల్పోయింది.

ఇక చంద్రయాన్‌-1ను 2008లో చేపట్టగా.. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని