ఇంధన ధరలకు రెక్కలు.. ఆర్టీసీకి చుక్కలు

రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు ఆర్టీసీకి గుదిబండలా మారిపోయాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఆకాశాన్నంటుతున్న డీజిల్‌ ధరలు మరింత భారంగా మారాయి....

Published : 25 Feb 2021 02:03 IST

పెనుభారంగా ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌

ఇంటర్నెట్ డెస్క్‌: రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు ఆర్టీసీకి గుదిబండలా మారిపోయాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఆకాశాన్నంటుతున్న డీజిల్‌ ధరలు మరింత భారంగా మారాయి. ఏడాదికి సుమారు 20 లక్షల కిలో లీటర్ల డీజిల్ వినియోగిస్తున్న ఆర్టీసీపై పెరిగిన ధరలతో దాదాపు రూ.350 కోట్ల భారం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో 9754 బస్సులను ప్రయాణికుల కోసం తిప్పుతున్నారు. డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ తదితర పన్నులు సంస్థకు పెను భారంగా మారాయి. లాక్‌డౌన్‌ తర్వాత పూర్తిస్థాయిలో బస్సులు రోడ్డెక్కుతుండగా, పెరిగిన ధరలతో వాటిని తిప్పేందుకు అధిక వ్యయం ఖర్చవుతోంది.

ఆర్టీసీ ఆర్థిక వనరులు కరిగిపోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు రెండు వారాలు ఆలస్యంగా ఇస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు డీజిల్‌ ధరలు పెరుగుతూ పోతే మున్ముందు పరిస్థితులపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్ తదితర పన్నులు రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రయాణికులపై ఆ భారం పడకుండా ప్రభుత్వాలే భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఛార్జీలు పెంచుకుంటూ పోతే ప్రజలు ఆర్టీసీకి దూరమవడం ఖాయమని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని