ప్రైవేటుకు అప్పజెప్పేలా విద్యుత్‌ బిల్లు: జగదీశ్ రెడ్డి

భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ రెండో యూనిట్‌కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు....

Published : 03 Jul 2020 16:37 IST

హైదరాబాద్‌: భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ రెండో యూనిట్‌కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. కొందరు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. మరో నెలన్నరలో మూడో యూనిట్‌ను ఆరంభిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రిలో పూర్తి స్థాయిలో 1080 మె.వా విద్యుత్‌ ఉత్పత్తిని త్వరలోనే ఆరంభిస్తామని మంత్రి అన్నారు.

‘విద్యుత్‌ బిల్లుపై కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. వివిధ అంశాలపై అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రానికీ ప్రజలకూ ఉపయోపడే విధంగా బిల్లు లేదని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రధానికి లేఖరాశారు. రాయితీలు పొందే వారికి, రైతాంగానికి బిల్లుతో తీవ్ర నష్టం వస్తుంది. చిన్న చిన్న వినియోగదారులు సబ్సిడీలను కోల్పోతారు. విద్యుత్‌ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది’ అని జగదీశ్‌ రెడ్డి అన్నారు.

‘రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుంది. రాష్ట్రాల హక్కులను ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా బిల్లు ఉంది. సమాఖ్య ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధంగా కేంద్రం తీరు లేదు. కొవిడ్‌ వల్ల డిస్కమ్‌లు ఇబ్బందులు పడుతున్నాయి. డిస్కమ్‌లకు 9.5% వడ్డీతో అప్పు ఇస్తామన్నారు. 8.5% ఇస్తే బాగుంటుందని మేం సూచించాం. విద్యుత్‌ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బంగ, పంజాబ్‌ మన అభిప్రాయాలతో ఏకీభవించాయి. మార్పులు చేస్తామని కేంద్రం చెప్పింది కానీ చేతల్లో కనిపించలేదు. సవరించిన ముసాయిదా మాకు అందలేదు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం’ అని జగదీశ్ రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని