ఇక్కడ ముఖాన్ని అమ్ముతారట!

ఎవరైనా ఆస్తులో, అంతస్తులో అమ్ముకుంటారు. కానీ జపాన్‌వాళ్లకి ముఖాన్ని అమ్ముకునే అవకాశం వచ్చింది. అదెలా సాధ్యం. అయినా ముఖాన్ని అమ్ముకుంటార..........

Published : 25 Mar 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా ఆస్తులో, అంతస్తులో అమ్ముకుంటారు. కానీ జపాన్‌వాళ్లకి ముఖాన్ని అమ్ముకునే అవకాశం వచ్చింది. అదెలా సాధ్యం. అయినా ముఖాన్ని అమ్ముకుంటారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే అసలు సంగతి తెలుసుకుందురు రండి.. 

జపాన్‌ వాళ్లు ఏది చేసినా వినూత్నంగా ఉంటుంది. టెక్నాలజీలో కూడా ముందుంటారు. ఎప్పుడూ ఏదో ఒక వింత ప్రయత్నం చేసి వార్తల్లో నిలుస్తారు. ఇప్పుడు కూడా అదే బాటలో ఈ వింత అమ్మకం మొదలు పెట్టారు. సంగతేంటంటే.. జపాన్‌ రాజధాని టోక్యోలో ‘కమెన్యా ఒమాటో’ అనే సంస్థ ‘ముఖాలని కొంటాం’ అంటూ ప్రకటన విడుదల చేసింది. అంటే మన ముఖాన్ని ఫొటో, వీడియో తీసుకుని అచ్చం మన ముఖంలాంటి మాస్క్‌లను 3డీ ప్రింట్‌ రూపంలో తయారుచేస్తున్నారు. మన ముఖాన్ని వాళ్లకు ఇచ్చినందుకు మనకు 40వేల యెన్‌లు ఇస్తారు. అంటే 26 వేల రూపాయలన్నమాట. మన ముఖాన్ని అమ్మితే 26 వేలు ఎలా ఇస్తారో అలాగే ఎవరి ముఖాన్ని అయిన కొనుక్కుంటే మన దగ్గర రూ.65 వేలు తీసుకుంటారు. అంటే వాళ్లకు డబుల్‌ కంటే ఇంకా ఎక్కువ లాభమొస్తుంది. ఈ ప్రాజెక్టుకు ‘దట్‌ ఫేస్‌’ అని ఆ సంస్థ పేరు పెట్టింది.

ఇంతకీ ఈ ఫేస్‌ మాస్క్‌లు తీసుకుని ఏం చేసుకుంటారు అనేగా మీ ప్రశ్న. కొంతమంది సరదాగా కొనుక్కుని ఫొటోకు ఫోజులిస్తుంటే.. మిగతావారు నేరాలు చేయడానికి చక్కటి అవకాశం అని లోలోన మురిసిపోతూ ఈ ఆఫర్‌కు సై అంటున్నారు. ఎందుకంటే జపాన్‌ వాళ్లు అందరి శరీరాకృతి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాబట్టి ఫేస్‌ మాస్క్‌ పెట్టుకుంటే ఎవరూ గుర్తు పట్టలేరు. కాబట్టి సులువుగా నేరాలు చేయొచ్చు. అయితే ఆ సంస్థ ముందే ఈ ఆలోచనని ఊహించింది, అందుకే మాస్క్‌ ఇచ్చేటప్పుడే ఈ మాస్క్‌ అమ్ముకునేవారుగానీ, కొనుక్కునేవారుగానీ చేసే చర్యలకు ఎలాంటి బాధ్యత మాకుండదు అనే ఒప్పంద పత్రాన్ని తీసుకుంటుంది. ఇక పోతే ఈ మాస్క్‌ ఎక్కువ సేపు ఉంచుకోవడం కుదరదు. ఎందుకంటే కళ్లు కూడా ప్రింట్‌ రూపంలో ఉండటంతో మాస్క్‌ పెట్టుకుంటే ఏమీ కనిపించదు. దాంతో కాసేపు సరదాగా వాడుకోవచ్చని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. అసలింతకీ ఈ వినూత్న ఆలోచనని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నా, అక్కడి ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని