స్టేట్‌ బ్యాంకులో కొలువులు!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి తొలిసారిగా సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ) పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 9 సర్కిళ్లలో 3850 ఖాళీలు ఉన్నాయి

Published : 31 Jul 2020 02:23 IST

3850 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ల నియామకానికి ప్రకటన 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి తొలిసారిగా సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ) పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 9 సర్కిళ్లలో 3850 ఖాళీలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ సర్కిల్‌లో 550 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన సర్కిల్‌లో పోస్టుల కోసం పోటీపడవచ్చు. బ్యాంకుల్లో ఆఫీసర్‌ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకు కార్యకలాపాలపై అనుభవం ఉన్న అభ్యర్థులను నియమిస్తే ఎటువంటి కాలయాపన, శిక్షణ అవసరం లేకుండా అభ్యర్థులు తమ విధులను నిర్వర్తించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భారతీయ స్టేట్‌ బ్యాంకు ఈ విధమైన ఎంపికలు చేపడుతోందని భావించవచ్చు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి, ప్రైవేటు బ్యాంకుల్లో అవకాశం వచ్చినందున చేరిపోయిన అభ్యర్థులకూ; గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న అభ్యర్థులకూ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో స్కేల్‌ -1 ఆఫీసర్‌గా ఉద్యోగం పొందే అవకాశం 

ఈ నోటిఫికేషన్‌ కలిగిస్తుంది.
సాధారణంగా బ్యాంకు ఆఫీసర్‌ ప్రతి మూడేళ్లకూ ఏ సర్కిల్‌లోని బ్రాంచికైనా బదిలీ అవుతారు. అయితే సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు (సీబీఓ) తాము ఎంచుకున్న సర్కిల్‌లోనే పన్నెండేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. ఇలా ఎంపికైనవారికి పదోన్నతులు కూడా ప్రొబేషనరీ ఆఫీసర్లగా నియమితులైనవారి మాదిరిగానే ఉంటాయి. ఇలా ఎన్నో అనుకూలతలు ఉన్న ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ తగిన విధంగా సన్నద్ధమైతే విజయం సాధించవచ్చు.

ఇవీ ప్రత్యేకతలు
అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్‌కే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారు సంబంధిత సర్కిల్‌ లోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

* విధుల్లో చేరినవారికి రూ.23,700 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులూ కలుపుకుని రూ.40 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

స్కేల్‌ 4 ఆఫీసర్‌ స్థాయికి చేరుకునే వరకు లేదా 12 ఏళ్ల వరకు (వీటిలో ఆలస్యమైనదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు) అదే సర్కిల్‌లో సేవలు అందించాలి.

ప్రొబేషన్‌ వ్యవధి 6 నెలలు. ఈ వ్యవధిలో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినవారిని స్కేల్‌ -1 ఆఫీసర్‌గా విధుల్లోకి తీసుకుంటారు. అప్పటి దాకా వీరిని సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ)గా వ్యవహరిస్తారు.

ఎవరు దరఖాస్తు చేయొచ్చు?
ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి రెండేళ్లు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకు (రీజనల్‌ రూరల్‌ బ్యాంకు)ల్లో ఆఫీసర్‌ స్థాయిలో పనిచేసి ఉండాలి. ఆగస్టు 1, 2020 నాటికి రెండేళ్ల అనుభవం పూర్తి కావాలి. ఆగస్టు 1, 2020 నాటికి వయసు 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

పోస్టు: సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 3850. వీటిలో 550 హైదరాబాద్‌ సర్కిల్‌లో ఉన్నాయి.

విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత

అనుభవం: ఆగస్టు 1, 2020 నాటికి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్‌ స్థాయిలో కనీసం రెండేళ్లు సర్వీస్‌ పూర్తిచేసుకోవాలి.

వయసు: ఆగస్టు 1, 2020 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.750. ఇతర వర్గాలవారు ఫీజు చెల్లించనవసరం లేదు

చివరి తేదీ: ఆగస్టు 16

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టు, ఇంటర్వ్యూ ద్వారా. అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు

వెబ్‌సైట్‌: 

https://bank.sbi/web/careers, https://www.sbi.co.im/web/careers

ఇలా ఎంపిక చేస్తారు

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. స్టేట్‌ బ్యాంకు ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్ట్‌ కమిటీ తగిన విధివిధానాలతో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. అయితే అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్షనూ నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాత పరీక్ష నిర్వహిస్తే సాధారణంగా ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి నిర్వహించే పరీక్ష మాదిరిగానే ఇదీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు తదనుగుణంగా దానికి సిద్ధం కావాలి.

రాతపరీక్ష ఎలా ఉండొచ్చు?
ఎస్‌బీఐ కానీ, ఐబీపీఎస్‌ కానీ సాధారణంగా ప్రొబేషనరీ అధికారుల నియామకానికి రెండు అంచెల (ప్రిలిమ్స్, మెయిన్స్‌) రాతపరీక్షను నిర్వహిస్తుంటాయి. పరీక్షను రెండు దశల్లో నిర్వహించినా వాటిలోని సబ్జెక్టులు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. ఒకవేళ ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ల నియామకానికి రాతపరీక్ష నిర్వహిస్తే... అది ఒకే పరీక్షగా మెయిన్స్‌ పరీక్ష తరహాలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పరీక్ష విధానానికి అనుగుణంగా సిద్ధమైతే మంచిది.

పీఓ మెయిన్‌ పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జి సబ్జెక్టులు ఉంటాయి. ఎస్‌బీఐ గతంలో నిర్వహించిన పీఓ పరీక్ష ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఏయే టాపిక్స్‌ నుంచి ఏ స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. అభ్యర్థులు ఆ స్థాయిలో సిద్ధమైతే సరిపోతుంది.

- డా. జి.ఎస్‌. గిరిధర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని