ఫోన్లో మా అమ్మ జ్ఞాపకాలున్నాయి.. ఇప్పించండి

కనిపించకుండా పోయిన చరవాణిలో మృతిచెందిన తల్లి ఫొటోలు ఉన్నాయని, ఆ ఫోన్‌ని ఎలాగైనా ఇప్పించాలని ఓ తొమ్మిదేళ్ల బాలిక పోలీసులను వేడుకున్న తీరు కలచివేసింది....

Published : 24 May 2021 01:54 IST

కంటతడి పెట్టిస్తున్న ఓ బాలిక విన్నపం

కొడగు: కనిపించకుండా పోయిన చరవాణిలో మృతచెందిన తన తల్లి ఫొటోలు ఉన్నాయని, ఆ ఫోన్‌ని ఎలాగైనా ఇప్పించాలని ఓ తొమ్మిదేళ్ల బాలిక పోలీసులను వేడుకున్న తీరు కలచివేసింది. కర్ణాటకలోని కొడగు జిల్లా కుశాల్‌నగర్‌కు చెందిన ప్రభ అనే మహిళకు కరోనా సోకడంతో మడికేరి ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈనెల 16న మృతిచెందారు. అయితే ఆసుపత్రిలో ఆమె చరవాణిని ఎవరో చోరీ చేశారు. అయితే ఆ ఫోన్‌లో తన తల్లి ఫొటోలున్నాయని.. ఎలాగైనా ఆ చరవాణిని ఇప్పించాలని మృతురాలి కుమార్తె హ్రితిక్ష పోలీసులను వేడుకొంది.  

హ్రితిక్ష బంధువు అక్షిత అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ..‘మే 15న ప్రభకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ మరుసటి రోజే ఆమె మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారమిచ్చాయి. మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె ఫోన్‌ను ఇవ్వాలని కోరగా.. అది కనిపించడంలేదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. తన తల్లికి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఆ చరవాణిలో ఉన్నాయని దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని హ్రితిక్ష వేడుకుంటోంది’ అని ఆమె తెలిపారు.

పోలీసులకు ఆ బాలిక పెట్టుకున్న అర్జీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమయిన కొడగు పోలీసులు ఫోన్‌ కోసం వేట ప్రారంభించారు. కొడగు ఎస్పీ క్షమా మిశ్రా మాట్లాడుతూ.. బాలిక చేసిన కంప్లైంట్‌ను సీరియస్‌గా తీసుకున్నామని..మడికేరి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఆసుపత్రి వర్గాలను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని