Railway reservation: రైల్వే రిజర్వేషన్‌ సేవలకు అంతరాయం.. ఆ 6 గంటలు బంద్‌!

రైలు టికెట్ల రిజర్వేషన్‌ సౌకర్యం ఆరురోజుల పాటు అర్ధరాత్రి సమయాల్లో అందుబాటులో ఉండదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Updated : 15 Nov 2021 12:10 IST

హైదరాబాద్‌: రైలు టికెట్ల రిజర్వేషన్‌ సౌకర్యం ఆరురోజుల పాటు అర్ధరాత్రి సమయాల్లో అందుబాటులో ఉండదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 14వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు రిజర్వేషన్ సౌకర్యం నిలిపివేయనున్నారు. ఇదే తరహాలో 20వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్‌ సేవలు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఆరు రోజుల పాటు ఆరేసి గంటల పాటు ఈ అసౌకర్యం ఏర్పడుతోందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఆరు రోజుల పాటు రిజర్వేషన్లకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంటుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక రైళ్ల నంబర్లకు బదులుగా సాధారణ రైళ్ల నంబర్లతో రైళ్లు నడపనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ కోసం ఆయా గంటల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఇన్నాళ్లూ ప్రత్యేక రైళ్లు నడిపిన రైల్వే శాఖ ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడంతో సాధారణ రైలు సర్వీసులను పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా రిజర్వ్‌డ్‌ రైళ్ల నంబర్లను అప్‌లోడ్‌ చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, పాత రైళ్ల నంబర్లను, ప్రస్తుత ప్యాసింజర్‌ బుకింగ్‌ డేటాతో పాటు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. టికెటింగ్‌ సర్వీసులపై ప్రభావం పడకుండా రాత్రి సమయంలో రైల్వే శాఖ ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో రిజర్వేషన్‌, కరెంట్‌ బుకింగ్‌, టికెట్‌ క్యాన్సిలేషన్‌ వంటి సేవలు అందుబాటులో ఉండవు. రిజర్వేషన్ సేవలు మినహా 139 టెలిఫోన్‌ సేవలు సహా మిగతా అన్ని విచారణ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. మార్పు చేసిన రైళ్ల నంబర్లను ఇప్పటికే టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఎస్సెమ్మెస్‌ ద్వారా తెలియజేస్తామని తెలిపింది. సంబంధిత రైల్వే స్టేషన్‌ విచారణ కేంద్రాల్లో, హెల్ప్‌ డెస్క్‌ల వద్ద కూడా రైళ్ల సంఖ్య మార్పు సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని