Sirivennela: పాట ఉన్నంతకాలం..‘సిరివెన్నెల’ మనతోనే!

‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన సిరివెన్నెల ప్రయాణం.. 

Published : 01 Dec 2021 01:45 IST

1. పాటల సిరి సంపన్నుడు ‘సిరివెన్నెల’

అక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి. పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన... ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ఆయన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

2. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ‘సిరివెన్నెల’!

ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కన్నుమూత చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మహోన్నత ప్రజ్ఞాశాలిని కోల్పోయామని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రి ప్రజ్ఞ, పాటవాల గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఏనాడో చెప్పారు. ఆయన తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం అని, తెలుగు వారి అదృష్టమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు.

3. సిరివెన్నెల అభిమానుల్లో నేనూ ఒకణ్ని: ఉపరాష్ట్రపతి

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని తెలుగు భాషకు పట్టం కడుతూ ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను ఒకరినన్నారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

4. సిరివెన్నెల పాడిన తొలి పాట ఇదే

సిరివెన్నెల కలం నుంచి వచ్చిన పదాల్ని వేరే గాయకులు ఆలపించడం చూశాం. కానీ ఆయనే రాసి, బాణీ కట్టి ఆలపించిన గీతాలూ ఉన్నాయి. ఎంవీ రఘు దర్శకత్వంలో రూపొందిన సంచలనాత్మక చిత్రం ‘కళ్ళు’. ఈ సినిమాకు దివంగత ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలందించారు.  సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నెల సాహిత్యం సిద్ధం చేసి ఇచ్చారట. ఆ పాటను విన్న ఎస్పీ బాలు... ‘మీరే ఈ పాట పాడండి బాగుంటుంది’ అన్నారట. ఆ మాట విన్న సిరివెన్నెల ‘మీరుండగా నేను పాడటం ఏంటి?’ అని అన్నారట. పాడటానికి తొలుత తటపటాయించిన సిరివెన్నెల... పది సార్లు ప్రాక్టీస్‌ చేసి పాడేశారట.

5. యూత్‌ అనేది ఏజ్‌ కాదు.. అదొక ఫేజ్‌. అదొక స్టేజ్‌: సిరివెన్నెల

తన తొలి సినిమా ‘సిరివెన్నెల’నే  ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు లెజండరీ రచయిత సీతారామశాస్త్రి. మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన తెలుగు సినీ పాటకు ఓ తేనె పూత. ట్విటర్‌లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్‌లో ‘ఆస్క్‌ సిరివెన్నెల’ (చిట్‌చాట్‌)లో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఆస్క్‌ సిరివెన్నెల’ కోసం క్లిక్‌ చేయండి.

6. సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల: సీఎం జగన్‌

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ‘‘తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం తెలుగు వారికి తీరని లోటు’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

7. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో సిరివెన్నెల సంతకాన్ని చూపించాలనుకున్నాం. కానీ,.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. తాను దర్శకత్వం వహిస్తోన్న ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘దోస్తీ’ మ్యూజికల్‌ వీడియోలో ఆయన సంతకం చేసే షాట్‌ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించక కుదర్లేదు’ అని తెలిపారు.

8. ‘సిరివెన్నెల’ మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు: చిరంజీవి

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల వేదికగా సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘సిరివెన్నెల మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు’ అని భావోద్వేగానికి గురయ్యారు.

9. మానవతావాదం, ఆశావాదం పొదిగిన అక్షర శిల్పి

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సంతాపం తెలిపారు. వాగ్దేవి వరప్రసాదంతో తెలుగునాట నడయాడిన విద్వత్కవి సిరివెన్నెల అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తన పాటతో మానవతావాదం, ఆశావాదం పొదిగిన అక్షర శిల్పి అని అన్నారు. ఒక కవిగా సమాజాన్ని నిలదీసి, బాధ్యతలు గుర్తు చేసేవారని పేర్కొన్నారు.

10. సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు వివరించిన కిమ్స్‌ ఎండీ

సిరి వెన్నెల చనిపోవడానికి గల కారణాలను కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు మీడియాకు వివరించారు. ‘‘ సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరో వైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ వస్తే అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్‌కు తీసుకొచ్చారు. ఎక్మో మిషన్‌పై ఉన్న తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, ఒబీస్‌ పేషెంట్‌ కావడం, కిడ్నీ డ్యామేజ్‌ అవడంతో ఇన్‌ఫెక్షన్‌ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని