PV Sindhu:  పి.వి.సింధుకు రూ.30 లక్షల నగదు పురస్కారం అందించిన ఏపీ సీఎం జగన్ |

ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు

Updated : 06 Aug 2021 14:51 IST

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న స్టార్‌ షట్లర్

అనంతరం సీఎం జగన్‌తో భేటీ

త్వరలో విశాఖ అకాడమీలో శిక్షణ ఇస్తా: పీవీ సింధు

విజయవాడ: ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానన్నారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024 ఒలింపిక్స్‌ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు.

ఏపీ ప్రభుత్వం చర్యలు సంతోషదాయకం

దుర్గమ్మ దర్శనం అనంతరం ఏపీ సీఎం జగన్‌ను పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును సీఎం అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింధును జగన్ సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని సీఎంకు సింధు చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు. ప్రభుత్వం తరఫున సింధుకు రూ.30 లక్షల చెక్కును అధికారులు అమెకు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని