Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 19 Jan 2022 17:01 IST

1.ఏపీలో ఆర్టీపీసీఆర్‌ ధరలు తగ్గించిన ప్రభుత్వం

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ టెస్టు కోసం వచ్చిన బాధితుల నుంచి కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ధరలను పునఃసమీక్షిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

2.రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ: సీఎస్‌ సమీర్‌ శర్మ

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ  నిరసనలు చేపట్టారు. జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల పీఆర్సీ, ఇతర అంశాలపై సీఎస్‌ సమీర్‌ శర్మ వివరణ ఇచ్చారు.

3.ఏపీలో ఒక్క రోజే 10వేలు దాటిన కరోనా కేసులు .. 8మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 10వేల కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.  కరోనా బారి నుంచి నిన్న 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు.

బుర్జు ఖలీఫాపై ఆ మహిళ మరోసారి ప్రత్యక్షం

4.మార్చి నాటికి ఎండమిక్‌ దశకు కరోనా..!

మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. ‘మనం మన రక్షణ కవచాల(కొవిడ్‌ నిబంధనలను ఉద్దేశిస్తూ) విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుంది. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను భర్తీ చేస్తే.. కొవిడ్ ఎండమిక్‌గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతే ఆ అవకాశం ఉంటుంది’ అని పాండా అభిప్రాయపడ్డారు.

5.ఆటకు వీడ్కోలు చెబుతా.. ఇదే నా చివరి సీజన్: సానియా

ప్రస్తుత సీజనే (2022) తనకు చివరిదని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ప్రకటించింది. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా అంతర్జాతీయంగా 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మూడు సార్లు మహిళల డబుల్స్‌ టైటిళ్లు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ విజేతగా సానియా మీర్జా నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే సానియా జోడీ ఓటమిపాలైంది.

6.‘చిన్న కోడలు’.. పెద్ద మార్పు.. ఎవరీ అపర్ణాయాదవ్‌?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరదలు అపర్ణా యాదవ్‌ బుధవారం భాజపాలో చేరారు. అపర్ణ చేరికతో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయనేది పక్కనబెడితే.. రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ అయిన భాజపాలో చేరడమనేది ఎన్నికల వేళ పెద్ద మార్పే అని చెప్పాలి.

7.యువ భారత్‌ దారి చూపుతోంది: మోదీ

కరోనా కట్టడిలో భాగంగా 15-18 ఏళ్ల వయసు వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యాక్సినేషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో ఆ వయసు గ్రూప్‌లో 50 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వార్త అని అన్నారు.

AP News: విశాఖలో విభిన్న సెట్లతో స్టూడియో

8.నిన్న పంజాబ్‌.. నేడు గోవా: సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌

దిల్లీకే పరిమితమైన అధికారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని చూస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. మంగళవారం పంజాబ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ.. బుధవారం గోవా సీఎం అభ్యర్థిని ప్రకటించింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన అమిత్‌ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటన చేశారు.

9.ఎంత పనున్నా పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయిస్తా..: ప్రియాంక

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఈ విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ గంటలు పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ పిల్లల చేత హోమ్‌వర్క్‌ చేసే విషయంలో సాయపడతా అంటున్నారు ప్రియాంక గాంధీ వాద్రా.

10.ఆ మనిషి నేనే..! ఆ గొంతు నాది కాదు..!

పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’తో ప్రేక్షకులను పలకరించనున్న హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా ఓ నిజాన్ని బయటపెట్టాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’  కార్యక్రమంలో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. షోలో విజయ్‌ దేవరకొండ చిన్నప్పటి వీడియోని బాలకృష్ణ ప్లే చేశారు. గతంలో ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ‘‘మేం చూసేది విజయ్‌నేనా..?’’ అంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని