Top Ten News @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. US: గ్రీన్కార్డు జారీపై పరిమితి ఎత్తేద్దాం!
అమెరికాలో శాశ్వత నివాసానికి దారులు తెరిచే గ్రీన్కార్డు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు శుభవార్త! ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని ఎత్తివేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం... ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల్లో.. ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం-2021 ఈ పరిమితిని తొలగించాలని కోరుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. బంగ్లాకు డ్రాగన్ బెదిరింపులు
అంతర్జాతీయ స్థాయిలో ఎంతగా విమర్శల పాలవుతున్నా- చైనా తన దుందుడుకు వైఖరిని మార్చుకోవడం లేదు. అహంకార ధోరణిని వీడటం లేదు. తాజాగా బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంలోనూ డ్రాగన్ జోక్యం చేసుకుంది. క్వాడ్లో చేరికపై ఆ దేశాన్ని హెచ్చరించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకంగా మారుతున్న ఆ కూటమిపై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో- బంగ్లాదేశ్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు నమోదుకు వినతి
వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీని నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ప్రతిపాదన అందింది. హైదరాబాద్కు చెందిన వాడుక రాజగోపాల్ ఛైర్మన్/ప్రెసిడెంట్గా, సుధీర్కుమార్ ప్రధాన కార్యదర్శిగా, నూకల సురేష్ కోశాధికారిగా ఈసీఐకి ప్రతిపాదనలు పంపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు నమోదుకు తమకు ప్రతిపాదనలు అందాయని, పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 16లోగా తెలియజేయాలని ఈసీఐ ఓ ప్రకటనలో కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. శుక్రుడిపై శోధనకు రెండు వ్యోమనౌకలు
శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం రెండు వ్యోమనౌకలను ప్రయోగించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివర్లో వీటిని పంపుతామని తెలిపింది. భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రహం నిప్పుల కొలిమిలా మారడానికి దారితీసిన పరిస్థితులపై పరిశోధన సాగించడం వీటి ఉద్దేశం. ‘‘శుక్రుడి ఉపరితలంపై సీసం కూడా కరిగిపోయేలా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీనికి కారణాలను ఈ వ్యోమనౌకలు వెలుగులోకి తెస్తాయి’’ అని నాసా అధిపతి బిల్ నెల్సన్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఆస్తి పత్రాలిస్తావా.. ముఖంపై దగ్గమంటావా!
ఆస్తి పత్రాలిస్తావా.. లేదంటే నీ ముఖంపై దగ్గమంటావా..! అసలే నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ మాజీ భార్య తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని ఓ వ్యాపారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్లో నివసించే సంజీవరెడ్డి(70) ఓ మహిళను(38)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు(17) ఉన్నారు. సంజీవరెడ్డి ప్రశాసన్నగర్లో ఆమె పేరిట ఓ ఇంటిని కొనుగోలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కరోనా వచ్చినా షుగర్ అదుపులో ఉండాలంటే!
6. మాల్యా ఆస్తుల్ని విక్రయించుకోవచ్చు
విజయ్ మాల్యా నుంచి రూ.5,646 కోట్ల మొండి బకాయిలు వసూలు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం ఆయన స్థిరాస్తులు, షేర్లు విక్రయించుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకుల బృందం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టును ఆశ్రయించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల్ని తాము విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చిన్నారులపై కొవిడ్ పడగ
కొవిడ్ రెండోదశ ఉధ్ధృతి ఇంకా ముగియనే లేదు. అప్పుడే మూడోదశ గుబులు మొదలైంది. ఈ దశలో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఆ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్ బారినపడే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో సుమారు 6000-8000 మంది వరకూ ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కీళ్లవాత ఔషధంతో తగ్గనున్న కొవిడ్ టీకా రక్షణ
8. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి కొవిడ్-19 ఔషధం
కొవిడ్-19 చికిత్సలో వినియోగించే ఔషధాలు ఆవిష్కరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ‘నిక్లోసామైడ్’ అనే మందును కొవిడ్-19 చికిత్సలో వినియోగించాలని ప్రతిపాదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యవసర ఔషధాల్లో ఇది ఒకటి. దీన్ని 50 ఏళ్లుగా నులిపురుగుల నివారణ (టేప్వార్మ్ ఇన్ఫెక్షన్) లో వినియోగిస్తున్నారు. 2003-04లో ఆఫ్రికా దేశాల్లో, మరికొన్ని ఇతర దేశాల్లో వెలుగుచూసిన సార్స్ వ్యాధికి చికిత్సలో వైద్యులు ఈ మందు సిఫారసు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అరంగేట్రంలో అదరగొట్టాడు
కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (200; 347 బంతుల్లో 22×4, 1×6) అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే ద్విశతకంతో సత్తాచాటాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన ఈ 29 ఏళ్ల ఓపెనర్ ఆడిన తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదేసి రికార్డుల దుమ్ము దులిపాడు. ఓవర్నైట్ స్కోరు 136 పరుగులతో రెండో రోజు, గురువారం ఆట కొనసాగించిన కాన్వే చూడముచ్చటైన ఆటతో అలరించాడు. సిక్సర్తో అతను ద్విశతకాన్ని చేరుకోవడం విశేషం. అయితే ఆ వెంటనే అతను రనౌట్ కావడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 378 పరుగుల వద్ద ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Vaccine: బూస్టర్ డోసులు అవసరమా?
కొవిడ్-19 టీకాల వల్ల జీవితకాల రక్షణ లభిస్తుందా లేక కొంతకాలానికి బూస్టర్ డోసులు అవసరమవుతాయా అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న అగ్రశ్రేణి వ్యాక్సిన్ల వల్ల కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ లభించొచ్చని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. తరచూ బూస్టర్ డోసులు పొందాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. తనకు తారసపడే వైరస్లను మానవ శరీరం ఎలా గుర్తుంచుకుంటుందన్న అంశంపై కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఈ వాదనను బలపరుస్తున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కొవిడ్ చికిత్సకు రుణ సాయం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని