
2013 Patna blasts: మోదీ ర్యాలీలో పేలుళ్ల ఘటన.. నలుగురికి ఉరిశిక్ష
పట్నా: బిహార్ రాజధాని పట్నాలో 2013లో మోదీ ర్యాలీ సందర్భంగా జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురికి ఉరిశిక్ష పడింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక న్యాయస్థానం.. నేడు శిక్ష ఖరారు చేసింది. నలుగురికి ఉరిశిక్షతో పాటు, ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
2013లో ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో ‘హుంకార్’ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. మోదీ ప్రసంగం చేయాల్సిన వేదికకు 150 మీటర్ల దూరంలో వరుసగా ఆరు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మోదీ, ఇతర భాజపా నాయకులు సభా వేదికకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయపడ్డారు.
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. దీనిపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గతవారం విచారణ జరిపింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతడి కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు బదిలీ చేసింది. మరో వ్యక్తిని సరైన ఆధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించింది. మిగతా 9మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. సోమవారం వారికి శిక్షలు ఖరారు చేసింది.
ఇవీ చదవండి
Advertisement