17లక్షల మందిని కబలించిన కాలుష్యం!

గాలి కాలుష్య ప్రభావంతో సంభవిస్తోన్న అకాల మరణాలు, అనారోగ్యం కారణంగా 2019 సంవత్సరంలో భారత్‌కు రూ.రెండున్నర లక్షల (రూ.2,60,000)కోట్ల నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.

Published : 23 Dec 2020 02:14 IST

లాన్సెట్‌ నివేదిక వెల్లడి

దిల్లీ: గాలి కాలుష్య ప్రభావంతో సంభవిస్తోన్న అకాల మరణాలు, అనారోగ్యం కారణంగా 2019లో భారత్‌కు రూ.రెండున్నర లక్షల (రూ.2,60,000)కోట్ల నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.4శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గతేడాది భారత్‌లో దాదాపు 17లక్షల మరణాలు వాయు కాలుష్యం కారణంగానే సంభవించినట్లు లాన్సెట్‌ నివేదిక స్పష్టంచేసింది. 

భారత్‌లో ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై వాయు కాలుష్య ప్రభావంపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. 1990-2019 మధ్య కాలంలో గృహ వాయు కాలుష్యం భారీ స్థాయిలో తగ్గడం వల్ల దాదాపు 64శాతం కాలుష్య మరణాలను తగ్గించగలిగనట్లు ఈ నివేదిక వెల్లడించింది. కానీ, అదే సమయంలో బాహ్య వాతావరణంలో పెరిగిన కాలుష్యం కారణంగా దాదాపు 115శాతం మరణాలు పెరిగినట్లు స్పష్టంచేసింది. ఈ కాలుష్యం వల్ల సంభవించే మరణాలు, వచ్చే వ్యాధుల ఫలితంగా కోల్పోయిన ఉత్పాదకత దేశ జీడీపీలో 1.4శాతమని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి ఉత్తర, మధ్య భారత్‌ రాష్ట్రాల్లో ఈ నష్టం అధికంగా ఉందని స్పష్టచేసింది. 

అయితే, భారత్‌ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధిస్తోందని.. గాలి కాలుష్యాన్ని తగ్గిస్తే మరింత పురోగతి సాధించే అవకాశం ఉన్నట్లు తాజా శాస్త్రీయ నివేదిక వెల్లడించింది. భారత్‌లో కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయే తాజా శాస్త్రీయ నివేదిక రుజువుచేస్తోందని నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు.

‘గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో ఇప్పటికే దేశంలో అనేక కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. కాలుష్యం కేవలం ఆరోగ్య రంగంపైనే కాకుండా భారతీయుల ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుందనే విషయం తాజా నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదిక, కాలుష్య నియంత్రణలో ఆయా రాష్ట్రాలు చేపడుతోన్న కృషికి ఎంతో దోహదపడుతాయి’ అని వీకే పాల్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రధాన‌ మంత్రి ఉజ్వల యోజన వంట పథకాలు గృహ కాలుష్యాన్ని తగ్గించడంలో ఎంతో దోహదపడుతున్నాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలను ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
కాలుష్యం తరిమేద్దామిలా..వినూత్న ఆలోచన
ఇటలీలో మృత్యుఘోష: కారణాలు ఏంటంటే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని