
11 గంటల్లో 180 కిలోమీటర్ల పరుగు
యుద్ధ వీరుల గౌరవార్థం బీఎస్ఎఫ్ వినూత్న ప్రయత్నం
బికనేర్ (రాజస్థాన్): 1971 యుద్ధ వీరుల గౌరవార్థం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వినూత్న కార్యక్రమం చేపట్టింది. విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా డిసెంబరు 13-14 అర్ధరాత్రి భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 180 కిలోమీటర్ల రిలే రేస్ చేపట్టింది. రాజస్థాన్లోని బికనేర్ నుంచి ప్రారంభమైన ఈ పరుగు అనూప్గఢ్లో ముగిసింది. 11 గంటల్లోపే జవాన్లు ఈ రిలే పరుగు పూర్తిచేయడం విశేషం. 930 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది ఈ రేస్లో పాల్గొన్నారు. ఒక్కో జవాను దాదాపు 400 నుంచి 500 మీటర్ల పరిగెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు బీఎస్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. జవాన్లు పరిగెత్తిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.
1971లో పాకిస్థాన్పై విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబరు 16న విజయ్ దివస్ పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. 1971లో తూర్పు పాకిస్థాన్లో మొదలైన స్వతంత్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో భారత్.. పాక్ను ఓడించింది. తదనంతరం తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడింది.