టిక్‌టాక్‌ అయిపోయింది.. పబ్‌జీ వంతు..! 

ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను నిషేధించి చైనాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చిన కేంద్రం మరిన్ని యాప్‌లనూ నిషేధించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ.......

Published : 28 Jul 2020 01:47 IST

చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను గుర్తించే పనిలో కేంద్రం

280 చైనా యాప్‌లపై నిషేధం?

దిల్లీ: ‘యే పబ్‌జీ వాలా హై క్యా’.. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన కుమారుడు పబ్‌జీ ఆటకు బానిసయ్యాడంటూ ఓ తల్లి చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోదీ స్పందన ఇది. ఇప్పుడు ఆ తల్లికి ప్రధాని ఊరటనిచ్చే సమయం వచ్చింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు భారత్‌ ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బహుళ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించింది. వీటిని అనుసంధానంగా ఉంటూ మారుపేర్లతో పనిచేస్తున్న మరో 47 యాప్‌లనూ శుక్రవారం నిషేధించింది.  అదే దారిలో మరో 280 యాప్‌లనూ నిషేధించేందుకు తాజాగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నట్లు అర్థమవుతోంది. యాప్‌ల నిషేధం తమని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది. పైగా నిషేధానికి గురైన కొన్ని సంస్థలు తమ కార్యకలాపాల్ని చైనా వెలుపలకు తరలించేందకు సిద్ధమయ్యాయి. అవసరమైతే చైనా ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాల్ని, ఇతర సంబంధాల్ని కూడా తెగదెంపులు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. 

యాప్‌ల గుర్తింపు..

ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను నిషేధించి చైనాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చిన కేంద్రం మరిన్ని యాప్‌లనూ నిషేధించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను గుర్తించే పనిలో పడింది. పబ్‌జీ సహా సుమారు 280 యాప్‌లు కేంద్రం జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై ఇప్పటికే కేంద్ర నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా యాప్‌ల ద్వారా డేటా ఎలా మారుతుందో సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే 20 యాప్‌ల ద్వారా జరుగుతున్న డేటా ట్రాన్స్‌ఫర్‌ను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అవసరమైతే చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లపై వేటు వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని