భవిష్యత్తులో కరోనా కంటే పెద్ద మహమ్మారులు!

యావత్తు ప్రపంచంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దాదాపు అన్ని రంగాలకు కుదేలు చేసింది. అయితే, కరోనా మహమ్మారి అంత పెద్దదేం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.........

Updated : 29 Dec 2020 15:34 IST

సన్నద్ధంగా ఉండాలని హెచ్చరించిన WHO

జెనీవా: యావత్తు ప్రపంచంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దాదాపు అన్ని రంగాలను కుదేలు చేసింది. అయితే, కరోనా మహమ్మారి అంత పెద్దదేం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైకేల్‌ ర్యాన్‌ సూచించారు.

కరోనా చాలా వేగంగా వ్యాపించి అనేక మందిని బలిగొందని ర్యాన్‌ గుర్తుచేశారు. అయితే, భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరింత తీవ్రమైన అంటువ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా సమయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వేగవంతమైన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ సలహాదారు బ్రూస్‌ ఇల్‌వర్డ్‌ గుర్తుచేశారు. అయినా, భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అందుకోవడంలో ఇంకా చాలా దూరం ఉన్నామని తెలిపారు. కరోనా రోజురోజుకీ రూపాంతరం చెందుతూ రెండు, మూడో దశలోకి ప్రవేశిస్తోందని గుర్తుచేశారు. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి కూడా ఇంకా మనం పూర్తి సన్నద్ధంగా లేమని తెలిపారు.

మరోవైపు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానామ్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు కరోనా మనల్ని సంసిద్ధుల్ని చేసిందని తెలిపారు. అయితే, అంటువ్యాధులపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. యావత్తు శాస్త్ర ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి కరోనా అంతానికి కృషి చేసిందని గుర్తుచేశారు. యూకే, దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు నిర్ధారణ పరీక్షల్ని చేస్తేనే కొత్త రకాల్ని గుర్తించగలమని తెలిపారు.

ఇవీ చదవండి..

కరోనా చివరి మహమ్మారి కాదు: WHO

ఆ 156 మంది ఎక్కడ?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని