గుండెతో అంబులెన్స్‌..18Km 12నిమిషాల్లో! 

ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్‌ అభ్యర్థనపై దిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. దిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్‌కు గుండె తరలింపులో ఎలాంటి .........

Updated : 25 Dec 2020 17:57 IST

దిల్లీ: ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్‌ అభ్యర్థనపై దిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. దిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్‌కు గుండె తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా అంబులెన్స్‌ వెళ్లేందుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. దీంతో 18.5 కి.మీల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లోనే అంబులెన్స్‌ చేరుకోగలిగింది. గుజరాత్‌లోని వడోదర నుంచి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ 2 వద్దకు గుండెను తీసుకొస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స కోసం సమయం వృథా కాకుండా త్వరగా తీసుకొచ్చేలా సహకరించాలని పోలీసులను కోరారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు.. దీనికోసం అధికారులను నియమించి గ్రీన్‌ కారిడార్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

విమానాశ్రయం నుంచి అంబులెన్స్‌ వెళ్లేందుకు జాప్యం జరగకుండా గురువారం గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు టెర్మినల్‌ 2 నుంచి పైలెట్‌గా ఎయిమ్స్‌ వరకు వచ్చారు. దీంతో వాహనాలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే దిల్లీ రహదారుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్‌ కేవలం 12 నిమిషాల్లోనే ఆస్పత్రికి చేరుకోగలిగింది. మామూలుగా అయితే విమానాశ్రయం నుంచి ఎయిమ్స్‌కు రావాలంటే 35 నుంచి 40 నిమిషాలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

గుండె మార్పిడితో యువకుడికి కొత్త జీవితం
మరోవైపు, అరుదైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 20 ఏళ్ల యువకుడికి దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వడోదరలో బ్రెయిన్‌ డెడ్‌కు గురైన 17ఏళ్ల బాలిక గుండెను తీసుకొచ్చి యువకుడికి అమర్చారు. ఎయిమ్స్‌లో ఈ ఏడాది జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సలో ఇది మూడోది. లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. 

పశ్చిమ దిల్లీకి చెందిన 20 ఏళ్ల యువకుడు అరుదైన గుండె జబ్బుతో గత నాలుగేళ్లుగా ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. గత ఆరు నెలలుగా ఆ యువకుడి పరిస్థితి క్షీణిస్తోందని ఎయిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ మిలింద్ హోతె అన్నారు. అతడు బాగా నీరసించి మంచానికే పరిమితం కావడంతో అత్యవసరంగా గుండె మార్పిడి అవసరమైందని తెలిపారు. అయితే, గుజరాత్‌లోని వడోదరలో గుండె లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ ఇచ్చిందన్నారు. దీంతో ఎయిమ్స్‌ బృందం గురువారం ఉదయం వడోదరకు వెళ్లి.. మధ్యాహ్నానికి గుండెను తీసుకొని దిల్లీకి వచ్చారని తెలిపారు. దాదాపు ఏడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించినట్టు చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం యువకుడు ఐసీయూలో ఉన్నాడని,  అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. గుండె తరలింపు విషయంలో ఇండిగో బృందం, దిల్లీ పోలీసులు పూర్తిగా సహకరించారని తెలిపారు. 

ఇదీ చదవండి..

మా వైరస్‌.. బ్రిటన్ కంటే ప్రమాదకరం కాదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని