బెర్నీ.. ముందే చెప్పేశాడు ఇవన్నీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయో కంటికి కట్టినట్టు రెండు వారాల క్రితమే ఒకరు చెప్పారు.

Published : 06 Nov 2020 01:22 IST

అమెరికా ఎన్నికల్లో ఏం జరగనుందో 2 వారాల ముందే వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్య ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని గురించి ఓ జ్యోతిష్కుడు ఊహించి చెప్పిన దాన్ని.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ట్వీట్‌ చేశారు. అయితే ఆయన చెప్పినదానికి, జరిగిన దానికి కాస్త తేడా ఉన్న మాట నిజం. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయో కంటికి కట్టినట్టు రెండు వారాల క్రితమే మరొకరు చెప్పారు. అది మరో జ్యోతిష్కుడో మరెవరో కాదు.. డెమొక్రాటిక్‌ సెనేటర్‌ బెర్నీ సాండర్స్‌. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయని 79 ఏళ్ల బెర్నీని ఓ ముఖాముఖిలో వ్యాఖ్యాత అడిగారు. ఇందుకు పోస్టల్‌ ఓట్లు భారీ సంఖ్యలో పోలవుతాయని.. దీని వల్ల ఎన్నికల ప్రక్రియ, ఫలితాల వెల్లడి కూడా ఆలస్యం కానున్నాయని ఆయన జవాబిచ్చారు.

అంతేకాకుండా ‘‘పెన్సిల్వేనియా, మిషిగన్‌, విస్కాన్నిన్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆలస్యమౌతుంది. ఇందుకు లక్షల సంఖ్యలో వచ్చిపడే పోస్టల్‌ బ్యాలెట్లు కారణం కావచ్చు. ఇక ఎన్నికల రోజు రాత్రి సుమారు 10 గంటలకు ట్రంప్‌ కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తాడు... ఇంకా పూర్తి ఫలితాలు వెలువడకుండానే ‘తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు’ అంటూ ప్రకటనలు చేస్తాడు. అతను గెలువని కొన్ని కీలక రాష్ట్రాల్లో మోసం జరిగిందని ఆరోపిస్తాడు. న్యాయవ్యవస్థ సరిగా పనిచేయాలని కోరుతాడు. ఓటింగ్‌ ప్రక్రియను వెంటనే ఆపాలని.. అందుకు గాను తాను సుప్రీం కోర్టుకు కూడా వెళతానంటాడు. ఆ తర్వాతి రోజు లేదా ఆపై రోజు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవుతుంది. బైడెన్‌ గెలిచినట్టు వెల్లడౌతుంది. అప్పుడు కూడా.. పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం లోపభూయిష్టమైనదనే తన వాదన రుజువైందని ట్రంప్‌ మళ్లీ ప్రకటిస్తాడు.’’ అని వెల్లడించారు. కాగా ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరగటం అందరికీ తెలిసిందే.

కాగా ఈ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించిన ఈ వీడియో చూసి.. బెర్నీ సాండర్స్‌ జోస్యం నిజమో కాదో మీరే నిర్ణయించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని