700 ట్రాక్టర్లలో దిల్లీకి..

దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ నుంచి కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీకి చెందిన రైతులు 700 ట్రాక్టర్లలో దిల్లీకి తరలివెళ్లారు.

Updated : 11 Dec 2020 20:33 IST

అమృత్‌సర్‌ నుంచి తరలిన రైతులు

దిల్లీ: దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ నుంచి కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీకి చెందిన రైతులు 700 ట్రాక్టర్లలో దిల్లీకి తరలివెళ్లారు. ఈ ట్రాక్టర్లు దిల్లీలోని కుండ్లీ సరిహద్దు వైపుగా వెళ్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశరాజధాని దిల్లీలో 16రోజులుగా వివిధ రాష్ట్రాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  గురువారం దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు మాట్లాడారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే రైల్వే ట్రాకులపై బైఠాయిస్తామని హెచ్చరించారు. సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడిన రైతు నాయకులు డిసెంబరు 12లోగా అన్ని టోల్‌ప్లాజాలు మూసేస్తామన్నారు. దిల్లీకి వచ్చే అన్ని రహదారులు ముట్టడించి నిరసన ఉద్ధృతం చేస్తామన్నారు. కేవలం పంజాబ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరు రైతులు రైల్వేట్రాకులు నిర్బంధించాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన తేదీ, తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. చట్టాలను వెనక్కి తీసుకొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న సవరణలన్నీ పాతవేనని, వాటి వల్ల ఉపయోగం లేదని వారు ఉద్ఘాటిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆరు సార్లు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులు నిరసనలతో ఇప్పటికే మూతబడ్డాయి. జైపుర్‌-దిల్లీ సరిహద్దును కూడా రైతులు ముట్టడించారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు కొవిడ్‌-19 నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని