బెంగాల్‌లో శాంతిభద్రతలు ఆందోళనకరం: గవర్నర్‌

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పేర్కొన్నారు.

Published : 06 Jun 2021 18:43 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేదిని సూచించినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల్లో అధికారపక్షంతో పోలీసులతో రాజీపడ్డారని ఆరోపించారు. సంబంధిత ట్వీట్‌ను మమతా బెనర్జీని కూడా ట్యాగ్‌ చేశారు.

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. భద్రతా విభాగం పూర్తిగా రాజీ వైఖరి అవలంబిస్తోంది. ఈ క్రమంలో పరిస్థితులను వివరించేందుకు సీఎస్‌ను సోమవారం (జూన్‌ 7న) కలవాలని సూచించా’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. ‘‘తృణమూల్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. దీంతో లక్షలాది మంది తరలిపోతున్నారు. వందలకోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. హత్యలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు సైతం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సొంత ఇళ్లలో ఉండాలన్నా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నా దోపిడీ రుసుము చెల్లింల్సి వస్తోంది’’ అని గవర్నర్‌ ఆరోపించారు. అధికార పార్టీ చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్య విలువలు కూనీ అవుతున్నాయని ట్విటర్‌లో రాసుకొచ్చారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని