‘భారత్‌, పాక్‌ మధ్య వివాదాలపై చర్చించాలి’

భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న వివాదాలను చర్చల ద్వారా తెర దించాలని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా శనివారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ..

Published : 20 Sep 2020 00:50 IST

దిల్లీ: భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న వివాదాలను చర్చల ద్వారా తెర దించాలని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా శనివారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు ఆ దేశంతో చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నాం. భారత, పాక్‌ సరిహద్దుల విషయంలోనూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. అవి పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ఒక్క చైనాతోనే కాకుండా.. పాకిస్థాన్‌తో కూడా చర్చలు చేపట్టి వివాదాల్ని తొలగించే దిశగా ప్రయత్నించాలి’ అని ఫరూఖ్‌ పేర్కొన్నారు. 

అదేవిధంగా షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించడంపై ఫరూఖ్‌ సంతోషం వ్యక్తం చేశారు. షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. జులైలో షోపియాన్లో సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ విషయమై విచారణ చేపట్టిన అధికారులు సైనికులు తమ అధికారాలను అధిగమించడం వల్లే ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలిపారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతల చట్టం కింద మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు నాయకుల్ని నిర్బంధంలో ఉంచారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత విడుదల చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని